
– మార్గదర్శకాలను సిద్ధం చేయని ప్రభుత్వం
– త్వరగా అమలు చేయాలని కోరుతున్న అతివలు
నవతెలంగాణ – మల్హర్ రావు
అర్హులైన మహిళలకు ప్రతి నెల రూ.2,500 చొప్పున ఆర్థిక సాయం అందించడానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా పచ్చజెండా ఉపలేదు.ఫలితంగా ఈ పథకం కింద సాయం కోసం ఎంతోమంది మహిళలు నిరీక్షిస్తున్నారు.ప్రధానంగా ఆసరా పథకం కింద పింఛన్ అందుకోలేని మహిళలు తమకు మహాలక్ష్మి సాయం కొండంత అండగా ఉంటుందని ఆశతో ఎదురుచూస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం కింద ప్రతినేలా ఆర్థిక సాయం అందించడం ఒకటి.2024-25 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆరు గ్యారంటీల కోసం ప్రభుత్వం రూ.53.196 కోట్లను కేటాయించింది.ఆసరా కింద మండలంలో మొత్తం మహిళ ఓటర్లు 11,230 ఉన్నారు.ఇందులో 16,40 మంది వితంతువులు, 34 మంది ఒంటరి మహిళలు, 180 వికలాంగులు, 789 వృద్ధాప్య మహిళలు ప్రతి నెలా పింఛన్లు అందుకుంటున్నారు.ఆసరా పింఛన్లు అందుకోలేని మహిళలు మహాలక్ష్మి సాయం ద్వారా లబ్ది పొందవచ్చని భావిస్తున్నారు.ఇప్పటి వరకు మార్గదర్శకాలను రూపొందించకపోవడంతో మహాలక్ష్మి సాయం ఎంతమందికి వస్తుంది, ఎవరు అర్హులు అనే విషయం తేలుతుంది.అసలు మహాలక్ష్మి పథకం అమలు చేస్తారా లేదా అనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఎలాంటి సర్వేలు జరపకపోవడం, అర్హుల ఎంపికకు చర్యలు తీసుకోకపోవడంతో పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి.పార్లమెంట్ ఎన్నికల తంతూ ఎలాగూ ముగిసిపోయింది.మరో నాలుగైదు రోజుల్లో కోడ్ ఎత్తివేసే అవకాశం ఉంది.ఇప్పటికైనా మహాలక్ష్మి సాయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని పలువురు మహిళలు కోరుతున్నారు.