ఘనంగా ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం

నవతెలంగాణ – ఉప్పునుంతల
బుధవారం మధ్యాహ్నం బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ, ఉపాధ్యాయులు బాలమణి, శ్రీనివాసులు, వెంకటేష్ మాట్లాడుతూ 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలబాలికలు అందరూ కూడా పనుల్లో చేరకుండా పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుకోవాలని పిలుపునిచ్చారు. బాలల విద్యాహక్కు, రక్షణ హక్కు, పాల్గొనే హక్కు, అభివృద్ధి హక్కులను కాపాడటం ప్రభుత్వం, సమాజంలోని వ్యక్తుల అందరి సమిష్టి బాధ్యత అని తెలియజేశారు. బాలలను పనిలో పెట్టుకోవడం నేరము. వారు శారీరకంగా మానసికంగా ఎదుగుతూ భవిష్యత్తుకు కావలసిన నైపుణ్యాలు పొందడానికి విద్యాలయాల్లో సరైన మౌళిక వసతులు అందుబాటులో ఉంచాలి. చదువు ద్వారానే జ్ఞానం, నైతిక విలువలు పొంది ఉత్తమ పౌరులుగా బాలలు తీర్చిదిద్దబడుతారు. కాబట్టి బడి ఈడు పిల్లలు అందరూ బడిలో చేరేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కృషి చేయాలన్నారు. అదేవిధంగా పాఠశాల పునః ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు స్వాగతం పలికారు. అనంతరం పాఠ్య పుస్తకాలు బడి పిల్లలకు అందజేశారు.