లిక్కర్‌ కంపెనీల ఒత్తిడికి తలొగ్గం

– పారదర్శకంగా మద్యం సరఫరా సంస్థల ఎంపిక
– కమిటీ నివేదిక తర్వాతే ధరల పెంపుపై నిర్ణయం
– ఆబ్కారీ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
లిక్కర్‌ కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. ఎక్సైజ్‌ శాఖ అధికారులతో శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. ఇటీవల యునైటెడ్‌ బేవరేజస్‌ కంపెనీ బీర్ల ధరలను 33.1 శాతం పెంచాలని ఒత్తిడి చేసిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కంపెనీల ఒత్తిడి కి తలొగ్గేది లేదనీ, పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీర్ల ధరలను పరిశీలించాలని సీఎం సూచించారు. హైకోర్ట్‌ రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ (ప్రైస్‌ ఫిక్సేషన్‌ కమిటీ) నివేదిక ఆధారంగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే టీజీబీసీఎల్‌కు సరఫరా చేస్తున్న కంపెనీలు, కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని సూచించారు. కొత్త కంపెనీల నుంచి ధరఖాస్తులు తీసుకునేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసి, కనీసం నెల రోజుల నిర్ణీత గడువు ఇవ్వాలని ఆదేశించారు. ఆయా కంపెనీలు తమ బ్రాండ్ల పేర్లతో దరఖాస్తు చేసుకోవాలనీ, నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత ఏడాదిగా ఎక్సైజ్‌శాఖకు మద్యం సరఫరా చేసే కంపెనీలకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నామని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను సైతం క్రమంగా క్లియర్‌ చేయాలని సీఎం ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్‌ ముర్తుజా రిజ్వీ, కమీషనర్‌ హరికిరణ్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.