ప్రభాస్, నయనతార జంటగా వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన చిత్రం ‘యోగి’. 2007వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం ప్రభాస్కు మంచి పేరు తెచ్చిపెట్టింది. పి.రవీంద్రనాథ్రెడ్డి సమర్పణలో ఈశ్వరి ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుదర్శన్రెడ్డి, చంద్ర ప్రతాప్రెడ్డిలు నిర్మించారు. రమణగోగుల సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు యువతను ఉర్రూతలూగించాయి. తాజాగా ఈ చిత్రాన్ని చందు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై లింగం యాదవ్ రీ రిలీజ్ చేస్తున్నారు. దీని కోసం ఈ చిత్రాన్ని 4కె ఫార్మట్లోకి మార్చారు.
దిల్రాజు, శిరీష్ సహకారంతో ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు మరోసారి ఈ సినిమా రాబోతున్న సందర్భంగా ఈ చిత్ర రీ రిలీజ్ ట్రైలర్తోపాటు పోస్టర్లాంచ్ ఈవెంట్ను ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగీత దర్శకుడు రమణ గోగుల ట్రైలర్, పోస్టర్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘టెక్నాలజీని వాడుకుని ఈ సినిమాను మంచి క్వాలిటీతో తీసుకొస్తున్నారు. సౌండ్ చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఈ రీ రిలీజ్ మంచి లాభాలు తీసుకొస్తుందని నమ్ముతున్నా’ అని అన్నారు.
‘ప్రభాస్ అభిమానులకు ఓ అద్భుతమైన ట్రీట్గా ఈ చిత్రాన్ని మంచి క్వాలిటీతో విడుదల చేస్తున్నాం. ఈ సినిమా రిలీజైనప్పుడు ప్రభాస్ అభిమానుల్లో చాలామంది చిన్న పిల్లలుగా ఉండి ఉంటారు. వారు ఇప్పుడు దీన్ని థియేటర్స్లో చూసి ఆనందిస్తారని ఖచ్చితంగా చెపుతాను. రమణ గోగుల అందించిన సంగీతం, వినాయక్ దర్శకత్వ ప్రతిభ, సుదర్శన్రెడ్డి, చంద్ర ప్రతాప్రెడ్డి రాజీలేని నిర్మాణ విలువలు ఈ సినిమాను గొప్పగా తీర్చిదిద్దాయి. రీరిలీజ్లో కూడా ఇది సూపర్హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా విషయంలో దిల్రాజు, శిరీష్ అండగా నిలిచి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే నా మిత్రడు నవీన్చంద్రరాజు, మాధవి ఈ ప్రాజెక్ట్ అనుకున్న దగ్గర నుంచి నాకు తోడుగా ఉన్నారు. ఈనెల 18న సుదర్శన్ థియేటర్లో అందరం కలిసి సినిమా చూస్తాం. ఇప్పటికే ఆన్లైన్లో బుకింగ్లు సూపర్గా అవుతున్నాయి’ అని నిర్మాత లింగం యాదవ్ చెప్పారు.