ఓయూ, బీసీ సంక్షేమ శాఖ ఒప్పందం

నవతెలంగాణ-ఓయూ
పాఠశాల విద్యార్థుల్లో శాస్త్రీయ నాయకత్వ ప్రేరణ కలిగించేందుకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ మిట్టల్‌ ఇన్‌స్టిట్యూట్‌ గురువారం రాత్రి త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఓయూ వీసీ ప్రొఫెసర్‌ డి. రవీందర్‌ సమక్షంలో రిజిస్ట్రార్‌ ప్రొ.పి. లక్ష్మీనారాయణ, మహాత్మా జ్యోతీరావు ఫూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శి డాక్టర్‌ మల్లయ్య భట్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న వంద మంది విద్యార్థులను సైంటిఫికల్లీ ఇన్‌స్పైర్డ్‌ లీడర్‌ షిప్‌ కార్యక్రమానికి ఎంపిక చేయనున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హార్వర్డ్‌ యూనివర్శిటీ మిట్టల్‌ ఇన్‌స్టిట్యూట్‌లు 2023 జనవరి 5 నుంచి 12 వ తేదీ వరకు శాస్త్రీయ నాయకత్వ శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం అవసరమైన నిధులను బీసీ వెల్ఫేర్‌ విభాగం సమకూర్చనుంది. కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొ. రెడ్యానాయక్‌, ప్రొ. జీబీ రెడ్డి, ప్రొ. జి.మల్లేశం, ప్రొ. మంగు, డాక్టర్‌ సీహెచ్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.