గవర్నర్‌ ప్రసంగంతోనే బడ్జెట్‌ సమావేశాలు

– హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
– బడ్జెట్‌పై ఆమోదముద్రకు గవర్నర్‌ తరఫు న్యాయవాది అంగీకారం
– హైకోర్టులో ఇరువురు న్యాయవాదుల మధ్య ఏకాభిప్రాయం
– పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న రాష్ట్ర సర్కారు
నవతెలంగాణ -హైదరాబాద్‌
గవర్నర్‌ ప్రసంగంతోనే ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన బడ్జెట్‌పై రాజ్యాంగానికి లోబడి అనుమతులిస్తామని గవర్నర్‌ తరఫు న్యాయవాది అంగీకారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ తరఫు న్యాయవాదులు ఏకాభిప్రాయానికి రావడంతో ఈ పిటిషన్‌పై విచారణను ముగిసినట్టు హైకోర్టు ప్రకటించింది. 2023-24 ఏడాదికి అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ అనుమతిచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీన్ని చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ టి.తుకారాంజీలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది. తొలుత చీఫ్‌ జస్టిస్‌ కల్పించుకుని రెండు రాజ్యాంగ వ్యవస్థలు ఉత్తర్వుల కోసం కోర్టుకు రావడం సరికాదని వ్యాఖ్యానించారు. ఇరుపక్షాలు కూర్చుని చర్చించి సమస్య ను పరిష్కరించుకోవాలని సూచిం చారు. రాష్ట్రపతి, గవర్నర్‌లకు ఏ కోర్టు లు కూడా నోటీసులివ్వలేవనీ, ప్రభు త్వం పిటిషన్‌ వేయడం సబబు కాదని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానిం చింది రాష్ట్రపతి, గవర్నర్లకు ఎలా నోటీసు ఇవ్వాలో చెప్పాలని కోరింది. రాజ్యాంగం నిబంధనలేమిటో చెప్పాల ని కోరింది. గవర్నర్‌కు తాము నోటీసు ఇవ్వగలమా అని ప్రశ్నించింది. గవ ర్నర్‌ విధుల్లో కోర్టుల న్యాయ సమీక్ష లకు రాజ్యాంగంలో ఎక్కడ ఆస్కారం ఉందో చెప్పాలంది. నిజంగానే తాము జోక్యం చేసుకుని ఆర్డర్‌ ఇస్తే కోర్టులు పరిధి దాటాయంటూ కూడా మీరే అంటారని వ్యాఖ్యానించింది. తమిళ నాడులో గవర్నర్‌ వాకౌట్‌ చేసినట్టుగా వార్తలు వచ్చాయనీ, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటే ఏ వివాదమూ ఉండబోదని సలహా ఇచ్చింది. రెండు రాజ్యాంగ వ్యవస్థలు కోర్టుకు రావడం కంటే సంప్రదింపులు మేలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదిస్తూ, గవర్నర్‌ ప్రసంగంతోనే అసెంబ్లీ బడ్జెట్‌ సెషన్‌ ఉంటుందని తెలిపారు. గతేడాదిలాగా కాకుండా ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాలు గవర్నర్‌ ప్రసం గంతోనే ప్రారంభమవుతాయన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్‌కు ప్రభుత్వం నుంచి గౌరవం లభించడం లేదని గవర్నర్‌ కార్యదర్శి తరఫు న్యాయవాది అశోక్‌ ఆనంద్‌ కుమార్‌ చెప్పగా, ఇకపై ఆలా జరగబోదనే హామీనిచ్చారు. గవర్నర్‌ బడ్జెట్‌ సమా వేశాల ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్‌ చేయబోయే ప్రసంగం కాపీని ప్రభుత్వం సిద్ధం చేస్తుందని చెప్పారు. ఉదయం జరిగిన వాదనల సమయం లో దవే వాదిస్తూ 2023-24 ఏడాది బడ్జెట్‌ను అసెంబ్లీలో పెట్టేందుకు గవర్నర్‌ అనుమతి విధిగా పొందాలన్నారు.
దీనిపై ఈ నెల 21న గవర్నర్‌ కు లెటర్‌ రాస్తే చర్యలు లేవనే విష యాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్‌ ఏమీ రాజ్యాంగానికి అతీతు లు కాబోరనీ, వ్యక్తిగత అభిప్రాయాల తో గవర్నర్‌ ఉండకూడదని వాదించా రు. రాజ్యాంగానికి అనుగుణంగా మంత్రిమండలి, అసెంబ్లీ తీర్మానాలకు గవర్నర్‌ ఆమోదం చెప్పాలన్నారు. ఇలా చేస్తేనే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజాభీష్టానికి అనుగుణం గా నిర్ణయాలు తీసుకుని అమలు చేయగలవన్నారు. గవర్నర్‌, రాష్ట్రపతి రాజ్యాంగానికి లోబడే ఉండాలన్నారు. తామేమీ గవర్నర్‌కు వ్యతిరేకం కాద న్నారు. ఇలాంటి సున్నిత సమస్యకు తెరదించాలన్నారు. సుప్రీంకోర్టు కేసు ల్లోని తీర్పుల ప్రకారం గవర్నర్‌కు హైకోర్టు నోటీసులు ఇవ్వొచ్చునని చెప్పారు. విధి నిర్వహణలో నిబంధన లు అమలు చేయకపోయినా, రాజ్యాం గపరమైన ప్రభుత్వ విధుల్ని నిర్వహిం చేందుకు దోహద పడకపోయినా కోర్టులు స్పందించాలని కోరారు. బడ్జెట్‌ ఆమోదం పొందకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక రూపాయి తీసుకునే అవకాశముండ దనీ, జీతాలిచ్చే పరిస్థితులు కూడా ఉండదనే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గవర్నర్‌ కార్యదర్శి తరఫు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయ వాది అశోక్‌ ఆనంద్‌ కుమార్‌ వాదిస్తూ గవర్నర్‌ ప్రసంగం లేకుండానే గతే డాది బడ్జెట్‌ సమావేశాలను నిర్వహిం చారనీ, సంప్రదాయాల ప్రకారం బడ్జెట్‌ తొలి సమావేశాలు గవర్నర్‌ ప్రసంగంతోనే జరగాలనే అంశాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రిపబ్లిక్‌డే కార్యక్రమాలనూ ప్రభుత్వం మొక్కుబడిగా నిర్వహించిందని చెప్పారు. వ్యక్తిగతం గా ఆహ్వానించినా ఎట్‌ హౌం కార్యక్రమానికి ముఖ్య మంత్రి హాజరుకాలేదన్నారు. గవర్నర్‌ విష యంలో నోటికి వచ్చినట్టుగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మాట్లాడారని చెప్పారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడినా చర్య లు లేవన్నారు. గవర్నర్‌ రాజ్యాంగాని కి విరుద్ధంగా వ్యవహరించే యోచన లో లేనేలేరని చెప్పారు. గవర్నర్‌ పలు విషయాలపై వివరణ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాస్తే కనీసం అధి కారులు కూడా జవాబు ఇవ్వలేదన్నా రు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి గవర్నర్‌ ప్రసంగం ఉండేలా చేస్తామని, సంప్రదాయాలను అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినందున ప్రభు త్వం వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకు నేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇందుకు అనుమతిస్తూ హైకోర్టు రిట్‌ పిటిషన్‌పై విచారణను ముగించింది.
గవర్నర్‌ను కలసిన మంత్రి వేముల
– అసెంబ్లీ సమావేశాలకు రావాలంటూ ఆహ్వానం
– ప్రసంగ ప్రతి అందజేత
రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళి సై సౌందరరాజన్‌తో… శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సోమవారం భేటీ అయ్యారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పి.రామకృష్ణారావు, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వి.నర్సింహాచార్యులతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన… 2023-24 రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలపాలనీ, దాన్ని ప్రవేశపెట్టేందుకు వీలుగా అనుమతినివ్వాలనీ గవర్నర్‌ను కోరారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు రావాలంటూ తమిళి సైని ఆహ్వానించారు. సంబంధిత ప్రసంగ ప్రతిని ఆమెకు అందజేశారు.