పెట్టుబడులు పెట్టండి

–  భారత కంపెనీలకు ఆఫ్ఘనిస్తాన్‌ ఆహ్వానం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారతదేశం నుంచి కనీసం 3 లక్షల కోట్ల డాలర్ల విలువైన మైనింగ్‌ పెట్టుబడులు ఆశిస్తున్నట్టు ఆఫ్ఘనిస్తాన్‌ రాయబారి ఫరీద్‌ మముంద్‌జె తెలిపారు. ఈ మేరకు వాణిజ్యం కోసం భారత కంపెనీలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. 500 మందికి పైగా ఆఫ్ఘనిస్తాన్‌ విద్యార్థులకు ఆతిథ్యం ఇచ్చినందుకు తెలంగాణ విద్యాసంస్థలకు ఆయన కతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌-కాబూల్‌ మధ్య ఎయిర్‌ కనెక్టివిటీని ఆఫ్ఘనిస్తాన్‌ కోరుకుంటున్నదని చెప్పారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ (ఎఫ్‌టీసీసీఐ), వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ సంయుక్తాధ్వర్యంలో బుధవారంనాడిక్కడ ఆఫ్ఘనిస్తాన్‌తో వ్యాపార అవకాశాల అన్వేషణపై ఇంటరాక్టివ్‌ సమావేశం జరిగింది. దీనికి భారతదేశంలో ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ అఫ్ఘనిస్థాన్‌ రాయబారి ఫరీద్‌ మముంద్‌జే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం తమకు సహజ వాణిజ్య గమ్యస్థానమని అన్నారు. తమ దేశ విద్యార్థులు ఉస్మానియా, మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్శిటీ, జేఎన్‌టీయూ, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ల్లో ఐదు వందల మందికి పైగా తెలంగాణలో చదువుతున్నారని తెలిపారు. గత ఇరవై ఏండ్లలో భారతదేశంలో చదివిన 60,000 మంది పూర్వ విద్యార్థులు తమ దేశంలో ఉంటే, వారిలో తెలంగాణ నుంచే దాదాపు 10వేల మంది పూర్వ విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య దాదాపు రూ.12 వేల కోట్ల వ్యాపారం జరుగుతున్నదనీ, భారత్‌కు డ్రై ఫ్రూట్స్‌, విలువైన రాళ్ళు, సెమీ విలువైన రాళ్ళు, సుగంధ ద్రవ్యాలు, కుంకుమపువ్వు తదితరాలను ఎగుమతి చేస్తున్నట్టు తెలిపారు.