రంజీ చాంపియన్‌ సౌరాష్ట్ర

– ఫైనల్లో బెంగాల్‌పై గెలుపు
కోల్‌కత : దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీని సౌరాష్ట్రం సొంతం చేసుకుంది. కోల్‌కత ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన ఫైనల్లో గెలుపొందిన సౌరాష్ట్ర గత మూడు సీజన్లలో రెండుసార్లు చాంపియన్‌గా అవతరించింది. 2020 రంజీ ట్రోఫీ ఫైనల్లో బెంగాల్‌పై విజయంతో విజేతగా నిలిచిన సౌరాష్ట్ర.. మళ్లీ అదే ప్రదర్శన పునరావృతం చేసింది. తొలుత బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు కుప్పకూలగా..సౌరాష్ట్ర 404 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. బెంగాల్‌ రెండో ఇన్నింగ్స్‌లో 241 పరుగులు చేయగా.. 12 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌరాష్ట్ర ఊదేసింది. 2.4 ఓవర్లలో 14/1తో 9 వికెట్ల తేడాతో బెంగాల్‌పై ఘన విజయం సాధించింది. సౌరాష్ట్ర కెప్టెన్‌ జైదేవ్‌ ఉనద్కత్‌ తొమ్మిది వికెట్ల ప్రదర్శనతో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ గా నిలువగా.. సౌరాష్ట్ర స్టాండ్‌ ఇన్‌ కెప్టెన్‌ అర్పిత్‌ వసవాడ (907 పరుగులు) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ’ అవార్డు అందుకున్నాడు. 2020 రంజీ ఫైనల్లో బెంగాల్‌పై విజయంతో సౌరాష్ట్ర చాంపియన్‌గా నిలిచింది. 2023 రంజీ ఫైనల్లో మరోసారి ఈ రెండు జట్ల పోటీపడగా.. మళ్లీ బెంగాల్‌కు భంగపాటు తప్పలేదు.