సన్‌రైజర్స్‌కు కొత్త సారథి

–  ఎడెన్‌ మార్కరంకు కెప్టెన్సీ పగ్గాలు
హైదరాబాద్‌ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2023 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సరికొత్త సారథితో బరిలోకి దిగనుంది. ఎస్‌ఏ20 టీ20 అరంగేట్ర సీజన్‌లో సన్‌రైజర్స్‌ ఈస్ట్రర్న్‌ కేప్‌ను చాంపియన్‌గా నిలిపిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ ఎడెన్‌ మార్కరం.. సన్‌రైజర్స్‌ మేనేజ్‌మెంట్‌ నమ్మకాన్ని సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌ 16లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మార్కరం కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు సన్‌రైజర్స్‌ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. కేన్‌ విలియన్స్‌ను వేలంలోకి వదిలేసిన హైదరాబాద్‌..ఈ ఏడాది వేలంలో నాయకత్వం వహించే స్థాయి ఆటగాడిని తీసుకోలేదు. భువనేశ్వర్‌ కుమార్‌, మయాంక్‌ అగర్వాల్‌లు నాయకత్వ రేసులో నిలిచారు. కానీ ఎస్‌ఏ20 టీ20 లీగ్‌లో మార్కరం అటు కెప్టెన్‌గా, ఇటు ఆటగాడిగా విజయవంతం అయ్యాడు. చీఫ్‌ కోచ్‌ బ్రియాన్‌ లారా సహా ఇతర సహాయక సిబ్బంది సైతం మార్కరంకు ఓటేశారు. ఆటగాళ్ల వేలంలో మార్కరంను రూ.2.6 కోట్లను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. గత సీజన్‌లో బరిలో నిలిపింది. 12 ఇన్నింగ్స్‌ల్లో 139.05 స్ట్రయిక్‌రేట్‌, 47.62 సగటుతో 381 పరుగులు చేసిన మార్కరం విమర్శకుల మెప్పు పొందాడు. ఇక ఈ ఏడాది ఎస్‌ఏ20లో సైతం మార్కరం ఓ శతకం సహా 369 పరుగులు బాదాడు. 6.19 ఎకానమీతో 11 వికెట్లు సైతం ఖాతాలో వేసుకున్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఏప్రిల్‌ 2న రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌తో ఐపీఎల్‌ టైటిల్‌ వేట షురూ చేయనుంది.