– రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు సభలు
– రైతు, వ్యకాస, సీఐటీయూ, ఐద్వా పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాన హక్కుల కోసం ఐక్య పోరాటాలు నిర్వహించాలని రైతు, వ్యకాస, సీఐటీయూ, ఐద్వా పిలుపునిచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల్లో ప్రదర్శనలు, సభలు నిర్వహించాలని కోరాయి. శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ. రమ అధ్యక్షతన ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి తదితరులు సమావేశమయ్యారు. మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనీ, మహిళలపై జరుగుతున్న దాడుల అరికట్టాలనీ డిమాండ్ చేస్తూ మార్చి 10 ,11 తేదీల్లో మండలాల్లో ప్రదర్శనలు సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మార్చి 14,15 తేదీల్లో జిల్లా కేంద్రాలు, రాష్ట్ర కేంద్రంలో ప్రదర్శనలు సభలు నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలోని మేధావులు ప్రజాసంఘాలు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.