సుక్మాలో ఎన్‌కౌంటర్‌తో రాష్ట్ర సరిహద్దుల్లో హైఅలర్ట్‌

–  భారీ ఎత్తున కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టిన గ్రేహౌండ్స్‌
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పోలీసులు మరణించడంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. సుక్మా జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు పోలీసులు అక్కడిక్కకడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఛత్తీస్‌గఢ్‌ యాంటీ నక్సలైట్‌ విభాగం పోలీసులు పారిపోయిన మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు సైతం ఈ సమాచారం అందించి అప్రమత్తం చేశారు. దీంతో ఛత్తీస్‌గఢ్‌ నుంచి రాష్ట్రంలోకి మావోయిస్టులు చొరబడకుండా చూడటానికి భారీ ఎత్తున రాష్ట్ర గ్రేహౌండ్స్‌ దళాలు సరిహద్దులో మోహరించాయి. ముఖ్యంగా ములుగు జిల్లా సరిహద్దు నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు సరిహద్దుల్లో గ్రేహౌండ్స్‌ బలగాలే కాకుండా తెలంగాణ రాష్ట్ర స్పెషల్‌ పోలీసు బెటాలి యన్‌కు చెందిన పలు కంపెనీల సాయుధ పోలీసులు మోహరించారు. గ్రేహౌండ్స్‌ బలగాలకు సహకరిస్తూ కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో సరిహద్దు జిల్లాలకు చెందిన రాష్ట్ర ఎస్పీలు సైతం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన ఆదేశాలు ఇస్తున్నారు.