నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్టులో ఒక మహిళ వద్ద నుంచి రూ.1.10 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. దుబారు నుంచి వచ్చిన విమానంలో దిగిన ఒక మహిళ అనుమానాస్పద పరిస్థితిలో కనిపించగా.. కస్టమ్స్ అధికారులు ఆమెను సోదాలు చేశారు. ఈ సోదాల్లో ఆమె వద్ద ఉన్న బ్యాగు నుంచి బంగారం ముద్ద బయటపడింది. దానికి కొలవగా.. 1560 గ్రాములుగా అది తేలింది. దాని విలువ రూ.1.10 కోట్లుగా అధికారులు తేల్చారు. కేరళకు చెందిన ఆ మహిళ దుబాయి నుంచి తాను అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని ఎవరికి చేరవేయదల్చుకున్నదనే విషయమై ఆమెను ప్రశ్నిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.