భారీ అగ్ని ప్రమాదం..16 మంది మృతి

నవతెలంగాణ – దుబాయ్‌
ఓ నివాస భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు భారతీయులు సహా సుమారు 16 మంది మృతి చెందారు. దుబాయ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీరా బుర్జ్‌ మురార్‌ ప్రాంతంలో రెసిడెన్షియల్‌ భవనంలోని అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ భవనం నాల్గో అంతస్థులో మొదలైన మంటలు క్షణాల్లో ఇతర అపార్ట్‌మెంట్‌లకు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో కేరళ, తమిళనాడుకి చెందిన వారు ఇద్దరు చొప్పున మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు దుబాయ్‌ సివిల్‌ డిఫెన్స్‌ ప్రతినిధి అల్‌ రాస్‌లో శనివారం మధ్యాహ్నాం 12.35 గంటలకు ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిపింది. అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని తరలింపు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. దాదాపు 10 మంది పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు.