నవతెలంగాణ హైదరాబాద్: ఉత్తర ఇరాన్(Iran)లో ఉన్న ఓ పునరావాస కేంద్రం (Rehabilitation Centre)లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 32 మంది మృతి చెందగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల మేరకు.. ఇరాన్ రాజధాని టెహ్రాన్కు 200 కి.మీ దూరంలో ఉన్న గిలాన్ ప్రావిన్స్లోని లాంగార్డ్ అనే ప్రాంతంలో మాదకద్రవ్యాలు తీసుకునే వారికి చికిత్స అందించే పునరావాస కేంద్రంలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని, ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు.