30 నుంచి పోడు పట్టాలు

అసిఫాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి ప్రారంభించనున్న సీఎం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో ఈ నెల 30 నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని అసిఫాబాద్‌ జిల్లాకేంద్రం నుంచి అదేరోజు ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి జిల్లాలు, నియోజకవర్గాల్లో అదే రోజు పోడు పట్టాల పంపిణీ చేయనున్నారు. ఈనెల 24 నుంచే పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రకటించినప్పటకీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈనెల 30వ తేదీకి మార్చాల్సి వచ్చిందని సీఎం తెలిపారు. జాతీయ ఎన్నికల కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుండటం, అందుకు సంబంధించి శుక్ర, శనివారాల్లో జిల్లా కలెక్టర్లకు శిక్షణాతరగుతులు నిర్వహస్తుండటంతో పాటు ఈ నెల 29 న బక్రీద్‌ పండుగ కూడా ఉండడం …వీటన్నింటి నేపథ్యంలో ప్రకటించిన కార్యక్రమాన్ని ఈ నెల 30 కి మార్చినట్టు సీఎం తెలిపారు. అసిఫాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాన్ని కూడా అదే రోజు సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.