ఇల్లందు మున్సిపల్‌ చైర్మెన్‌పై అవిశ్వాస తీర్మానం

– కలెక్టర్‌ అనుదీప్‌కు పత్రాలు అందజేత
– తిరస్కరించడంతో 18 మహిళా కౌన్సిలర్లు ఆందోళన
– కలెక్టర్‌ కార్యాలయం ఎదుట బైటాయింపు
నవతెలంగాణ-పాల్వంచ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ చైర్మెన్‌పై మెజార్టీ మహిళా కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించారు. కౌన్సిలర్ల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌కు అందజేయగా, ఆయన తిరస్కరించారు. కలెక్టర్‌ తీరుపై కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేస్తూ కార్యాలయం ఎదుట బైటాయించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు చేరుకొని వారికి నచ్చచెప్పారు. అధికార పార్టీ కౌన్సిలర్లమైన తమను కలెక్టర్‌ అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానం ఇచ్చే హక్కు మెజార్టీ కౌన్సిలర్లకు ఉందని, కాపీలు కలెక్టర్‌ తీసుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌ సీసీ వినతిపత్రాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా కౌన్సిలర్లు విలేకరులతో మాట్లాడుతూ.. ఇల్లందు మున్సిపాలిటీ చైర్మెన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు వ్యవహార శైలి బాలేదని, మహిళా కౌన్సిలర్ల పట్ల హేళనగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. 24 మంది కౌన్సిలర్లు ఉండగా 18 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చారని తెలిపారు. ఎన్నికల సమయంలో పట్టణ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాడని వాపోయారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశానికి ముందు రోజు అభివృద్ధిపై ఎజెండా గాని జరగబోయే అభివృద్ధిపై తమ కౌన్సిలర్లకు ఎవరికి తెలియపరచకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రశ్నించిన వారిని బెదిరిస్తూ బిల్లులను నెగ్గించుకుంటున్నారని చెప్పారు. అంతేకాకుండా మున్సిపల్‌ అధికారులను భయపెడుతూ బినామీ కాంట్రాక్టులతో టెండర్లు వేస్తూ పనులు జరిపించుకుంటూ కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి అన్యాయాలు, అక్రమాలను ఎన్నో సార్లు చైర్మెన్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. అందుకే మెజార్టీ కౌన్సిలర్లందరం అవిశ్వాస తీర్మానం చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. అవిశ్వాస తీర్మానం ఇచ్చిన వారిలో.. కౌన్సిలర్లు సిలివేరు అనిత, వాంకుడోత్‌ తార, చెరుపల్లి శ్రీనివాస్‌, తోట లలిత శారద, పత్తి స్వప్న, పాబోలు స్వాతి, వార్డు చీమల సుజాత, సామల మాధవి, సంద బిందు ఉన్నారు.