– 9 మందిని అరెస్టు చేసిన సైబర్క్రైమ్ పోలీసులు
– వివరాలు వెల్లడించిన సీపీ ఆనంద్
నవతెలంగాణ-సిటీబ్యూరో
పెట్టుబడుల పేరుతో రూ.712కోట్లు దండుకున్న 9మంది నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీగా సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.10,53,89,943 డబ్బులను వివిధ బ్యాంకుల్లో ఫ్రీజ్ చేశారు. శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో విలేకరుల సమావేశంలో సీపీ సీవీ ఆనంద్ వివరాలు వెల్లడించారు. ముంబాయి, లఖన్వూ, గుజరాత్, హైదరాబాద్కు చెందిన ఈ ముఠా దుబారు, చైనాకు చెందిన నేరస్థులతో సంబంధాలు పెట్టుకున్నారు. పెట్టుబడుల పేరుతో టెలీగ్రామ్, వాట్సాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకుని, షెల్ కంపెనీలు, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి చైనా, దుబారు నుంచి నేరుగా ఆపరేట్ చేస్తున్నారు. ఆన్లైన్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయించి, టాస్క్ల పేరుతో మొదట డబ్బులు చెల్లిస్తున్నారు. ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మోసం చేస్తున్నారు. ఈ ముఠా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 15వేల మంది బాధితులను మోసం చేసి రూ.712కోట్లు కొల్లగొట్టింది. ఈ డబ్బంతా పలు మార్గాల్లో క్రిప్టో కరెన్సీ ద్వారా దుబారు నుంచి చైనాకు పంపిస్తున్నారు. తీవ్రవాదులు ఉపయో గించే క్రిప్టో వెబ్సైట్కు ఈ డబ్బు వెళ్లినట్టు విచారణలో తేలింది. చైనా, దుబారులో ఉన్న ప్రధాన నిందితులకు ఇండియాలో సహకరి స్తున్న 9మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాపై 745 ఫిర్యాదులు వచ్చాయి. జాతీయ స్థాయిలో సమన్వయం చేసుకుని దర్యాప్తు చేయల్సి వుందని సీపీ తెలిపారు. సైబర్ మోసాలపై ప్రజలను ఎప్పటికప్పుడూ చైతన్యపరుస్తున్నా, కొంత మంది మోసపోతూనే ఉన్నారన్నారు.