జి 20 సదస్సు ప్రచార ఆర్భాటమే

The G20 summit is a publicity stunt– ప్రపంచ నేతగా చెప్పుకునేందుకు మోడీ తాపత్రయం
– సమస్యల పరిష్కారానికి నిర్ధిష్ట కార్యచరణ కరువు
– భారత్‌ ద్వారా దక్షిణ ధృవ దేశాలను కట్టడి చేసేందుకు అమెరికా కుట్ర : ఎస్‌వికె వెబినార్‌లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఆర్‌.అరుణ్‌ కుమార్‌
హైదరాబాద్‌ : దేశ రాజధాని ఢిల్లీలో రూ.4100 కోట్లు ఖర్చు చేసి అట్టహాసంగా నిర్వహించిన జి20 సదస్సు ప్రచార ఆర్భాటం తప్ప ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు చూపలేకపోయిందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఆర్‌ అరుణ్‌ కుమార్‌ అన్నారు. ప్రపంచ స్థాయి నాయకుడిగా ప్రధాని మోడీ తనకు తానుగా చెప్పుకునేలా జి20 సదస్సు ఏర్పాట్లు, నిర్వహణ ఉందని చెప్పారు. సదస్సుకు ఆతిధ్యం ఇచ్చిన ఢిల్లీలో అడుగడుగునా మోడీ కనిపిస్తున్నాడు..కానీ వాస్తవ పరిస్థితులను కనపడకుండా చేశారని విదేశీ మీడియాలో కథనాలు వచ్చాయని చెప్పారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘జి20 సమావేశం సాధించిందేమిటి..?’ అంశంపై మంగళవారం నిర్వహించిన వెబినార్‌లో అరుణ్‌ కుమార్‌ మాట్లాడారు.
జి20 సదస్సు ఉమ్మడి ప్రకటనపై ప్రపంచ దేశాలు ఆశక్తిగా ఎదురుచూస్తున్న సందర్భంలో..ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన భారత ప్రధాని మోడీ తొలిరోజే అది ప్రకటించి సమావేశాన్ని నీరుకార్చారని అన్నారు. గతేడాది ఇండోనేషియాలో జరిగిన జి20 సదస్సు డిక్లరేషన్‌కు భిన్నంగా ఈసారి ప్రకటన రావడం వెనక అమెరికా ఒత్తిడి ఉందని చెప్పారు. ఉక్రెయిన్‌పై తీసుకున్న వైఖరిని సౌదీ అరేబియా, కెనడా,నెదర్లాండ్స్‌ జపాన్‌, అనేక దేశాలు తప్పుబట్టాయని గుర్తుచేశారు. ఉక్రెయిన్‌ బలహీనపడుతోందని తెలిసి ఆదేశానికి సహాయం చేసే దేశాల ప్రజల్లో కూడా అసహనం పెరుగుతోందనీ, అందుకనే ఆయా దేశాల్లో పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరుగుతున్నాయన్నారు.
ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్‌ ఓటమిని అంగీకరిస్తే అమెరికా సామ్రాజ్యవాదానికి ముప్పు వాటిల్లుతుందనీ, అందులో నుంచి క్రమంగా బైట పడేందుకు ఆదేశం అన్వేషణ చేస్తోందన్నారు. ఉక్రెయిన్‌ విషయంలో పశ్చిమ దేశాల వైఖరిలో కూడా మార్పు వస్తుందన్నారు. రష్యా, చైనా దేశాల మిత్రత్వం బలంగా మారడంతో పాటు ఈరెండు దేశాలకు ప్రపంచ దేశాలు మద్దతుగా నిలబడటాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతుందని చెప్పారు. రష్యా యుద్దం సాకుగా చూపి ఇతర దేశాలను తమ వైపు తిప్పుకోవాలనుకున్న అమెరికా పన్నాగం పారలేదన్నారు. అమెరికా మద్దతిచ్చే దేశాల సంఖ్య తగ్గుతోందని తెలిపారు. చైనాను కట్టడి చేసేందుకు తీసుకున్న విధానల పట్ల అమెరికాపై వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతోందని వివరించారు.
రష్యా చైనా దేశాలు ప్రధాన భాగస్వామిగా ఏర్పడ్డ బ్రిక్స్‌.. ప్రదాన వాణిజ్య కూటమిగా అవతరించడం అమెరికాకు మింగుడుపడటం లేదన్నారు. దీన్ని కట్టడి చేసేలా ఢిల్లీ డిక్లరేషన్‌లో కొన్ని మార్పులు చేశారన్నారు. జి20 సదస్సు నిర్ణయాలను అమలు చేసేందుకు ప్రత్యేక యంత్రాగం లేదు కానీ బ్రిక్స్‌ నిర్ణయాలను అమలుచేసేందుకు ప్రత్యామ్నాయాలను సిద్దం చేసిందని పేర్కొన్నారు. లైంగిక అసమానతలు తగ్గించాలి, అవినీతిని అరికట్టాలి, ప్రజా ఆరోగ్యం, మత విశ్వాసాలను కాపాడతాం, పర్యావరణ పరిరక్షణ వంటి పలు కీలక అంశాలపై డిక్లరేషన్‌ చేశారు కానీ వాటిని అమలు చేసే ఫోరమ్‌ లేకపోవడం ప్రధాన అవరోధంగా మారిందన్నారు. ఎస్‌వికె మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినరుకుమార్‌ వెబినార్‌ను సమన్వయం చేశారు.