హైదరాబాద్ : దిగ్గజ బీమా సంస్థ లైఫ్ ఇన్య్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సింగిల్ ప్రీమియం పాలసీ ధన వృద్థి గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఆసక్తి కలిగిన పాలసీదారులు గడువు లోపే దీన్ని కొనుగోలు చేసుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది. గత జూన్లో ప్రారంభించిన ఈ పాలసీ పరిమిత ఆఫర్ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుందని వెల్లడించింది. పొదుపుతో పాటు బీమా కవరేజీ కావాలనుకునే వారు ఎల్ఐసీ ఏజంట్లు, ఎల్ఐసీ శాఖలను సంప్రదించాలని సూచించింది. ధన వృద్థి పాలసీ ఆన్లైన్లోనూ లభ్యం అవుతుందని తెలిపింది. ఈ పాలసీలో బీమా కవరేజీతో పాటు మీరు పెట్టే పెట్టుబడి సొమ్ముపై రిటర్న్స్ హామీ లభిస్తుంది. ఈ పాలసీ టెన్యూర్లో పాలసీదారుడు మరణిస్తే కుటుంబ సభ్యులకు ఆర్థికంగా సాయం అందిస్తుంది మెచ్యూరిటీ సమయం ముగిసిన తర్వాత గ్యారంటీ రిటర్న్స్ మొత్తం అందజేస్తుంది. 32 ఏండ్ల నుంచి 60 ఏండ్ల లోపు వారు ఈ పాలసీ తీసుకోవడానికి వీలుంది.