ఎంబీఏలో 22,422 మందికి సీట్ల కేటాయింపు

– ఎంసీఏలో 99.85 శాతం సీట్లు భర్తీ
– 30 వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు గడువు
– ఐసెట్‌ తుదివిడత సీట్ల కేటాయింపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో సాంకేతిక విద్యాశాఖ తుదివిడత సీట్లు కేటాయించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఐసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ వాకాటి కరుణ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంబీఏలో 258 కాలేజీల్లో 24,487 సీట్లుంటే, 22,422 (91.57 శాతం) మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. ఇంకా 2,065 (8.43 శాతం) సీట్లు మిగిలిపోయాయని వివరించారు. ఎంసీఏకు సంబంధించి 52 కాలేజీల్లో 3,316 సీట్లుంటే, 3,311 (99.85 శాతం) మందికి సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. ఎంసీఏలో ఐదు (0.15 శాతం) సీట్లు మిగిలాయని తెలిపారు. ఎంబీఏ, ఎంసీఏ కలిపి 27,803 సీట్లకుగాను 25,733 (92.55 శాతం) మందికి సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. ఇంకా 2,070 (7.45 శాతం) సీట్లు మిగిలిపోయాయని వివరించారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద 1,057 మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు తప్పనిసరిగా వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని సూచించారు. అందుకోసం ఈనెల 30 వరకు గడువుందని పేర్కొన్నారు. లేదంటే ఆ సీట్లు రద్దయిపోతాయని తెలిపారు. ఇతర వివరాలకు ష్ట్ర్‌్‌జూర://్‌రఱషవ్‌.అఱష.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.