– మెనూను త్వరగా రూపొందించండి
– అమలుకు ఏర్పాట్లు పూర్తి చేయండి
– అవసరమైన వంటపాత్రలు సమకూర్చండి: అధికారులకు మంత్రి సబిత ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలో తన కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన, విద్యాశాఖ అధికారులు, అక్షయపాత్ర ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు దసరా పండుగ రోజు నుంచి ”ముఖ్యమంత్రి అల్పాహార పథకం” ప్రారంభించనున్నట్టు మంత్రి తెలిపారు. ఇందుకు సంబందించిన మెనూను త్వరితగతిన నిర్ణయించి అందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఈ పథకానికి సంబంధించి విధి, విధానాలను రూపొందించాలని అధికారులకు సూచించారు. దేశంలోనే పాఠశాలల్లో అల్పాహారం అందిస్తున్న రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలిచిపోనుందని మంత్రి పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతోపాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా చేపట్టిన ఈ పథకంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలని అధికారులను కోరారు. ఈ పథకం అమలును జిల్లా స్థాయిలో పర్యవేక్షించే బాధ్యతను అదనపు కలెక్టర్లకు అప్పగించనున్నామని తెలిపారు. నాణ్యమైన విద్యతోపాటు మంచి పోషకాహారం అందించే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం విజయవంతం అయ్యేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి అవసరమైన వంట పాత్రలను సమకూర్చే ఏర్పాట్లు ప్రారంభించాలని తెలిపారు. ఈ పథకం అమలుచేయడం ద్వారా 27,147 పాఠశాలల్లోని దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుందని వివరించారు. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యాన్ని, విద్యార్థులకు గుడ్లు పంపిణీ చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై అధిక భారం పడుతున్నా తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని తెలిపారు.