పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల శిక్ష

– రూ.10వేల జరిమానా విధించిన నాంపల్లి కోర్టు
నవతెలంగాణ-సిటీబ్యూరో
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలుశిక్షతోపాటు రూ.10వేల జరిమానాను హైదరాబాద్‌ నాంపల్లి స్పెషల్‌ సేషన్‌ కోర్టు విధించింది. శుక్రవారం నగర సీపీ సీవీ ఆనంద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నానమ్మ వద్ద చదువుకుంటున్న ఓ బాలిక పాఠశాలకు సెలవులు రావడంతో 2018, ఏప్రిల్‌లో సికింద్రాబాద్‌లో నివాసముందే తండ్రి వద్దకు వెళ్లింది. బాలిక ఇంట్లో డ్రెస్‌ మార్చుకుంటున్న సమయంలో అక్కడే నివాసముంటున్న చింతాల మాణిక్యరావు దొంగచాటుగా ఫొటోలు, వీడియోను తీశాడు. వాట ిని అడ్డుపెట్టుకుని బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. తాను చెప్పి నట్టు వినకుంటే ఫొటోలను యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లో పెడతానని బెదిరించి లైంగిక దాడి చేశాడు. విషయం ఎవరికైనా చెబితే బాలిక తండ్రిని, సోదరున్ని చంపేస్తానంటూ హెచ్చరించాడు. ఇదిలా ఉండగా సెలవులు పూర్తికావడం తో బాలిక నానమ్మ వద్దకు వెళ్లిపోయింది. కానీ, బాలిక ప్రవర్తనలో మార్పు రావడంతో నానమ్మ ఆరా తీసింది. విషయం చెప్పడంతో చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితునిపై అప్పట్లో ఎస్‌.ఐ కె.వెంకట్‌ రెడ్డి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాధితురాలిని భరోసా సెంటర్‌కు తరలించారు. ఏసీపీ పి.వెంకటరమణ ఆదేశాలతో కేసును ఎస్‌ఐ అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ వేశారు. అన్నికోణాల్లో విచారించిన స్పెషల్‌ సెషన్‌ న్యాయమూర్తి టి.అనిత.. నిందితుడికి 20ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధించారు.