వేసవి సెలవుల్లోనే పదోన్నతులు పూర్తి చేయాలి

– సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలి
– జులై 1 నుంచి నూతన వేతన సవరణ అమలు జరగాలి :యూఎస్‌పీసీ స్టీరింగ్‌ కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) స్టీరింగ్‌ కమిటీ డిమాండ్‌ చేసింది. పాఠశాలలు పున:ప్రారంభమయ్యేలోపు పదోన్నతులు నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని కోరింది. ఆదివారం హైదరాబాద్‌లోని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో యూఎస్‌పీసీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సమావేశాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య అధ్యక్షతన నిర్వహించారు. విద్యారంగంలో నెలకొన్న పరిస్థితులను సమావేశం సమీక్షించింది. అనంతరం యూఎస్‌పీసీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు చావ రవి, వై అశోక్‌ కుమార్‌, ఎం రవీందర్‌, ఎం సోమయ్య, టి లింగారెడ్డి, కొమ్ము రమేష్‌, ఎన్‌ యాదగిరి, జాడి రాజన్న, మేడి చరణ్‌దాస్‌, కె భిక్షపతి, తులసీరాం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయుల బదిలీల జీ వోపై హైకోర్టులో స్టే కొనసాగుతున్నందున మొత్తం ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు. పాఠశాలల్లో వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం అస్తవ్యస్తంగా నడుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పదోన్నతులు, నియామకాల ద్వారానే ఖాళీ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. కనుక బదిలీలపై హైకోర్టు తీర్పు వచ్చేలోగా తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధ్యాయులకు పదోన్నతులు చేపట్టాలని కోరారు. తద్వారా ఏర్పడిన ఖాళీల్లో నియామకాలకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించారని గుర్తు చేశారు. సీపీఎస్‌ రద్దు వాగ్దానం చేసి హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు విధానాలను వ్యతిరేకిస్తూ పోరాడుతున్న బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణలోనూ సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులకు ప్రతినెలా మొదటి తేదీన వేతనాలివ్వాలని సూచించారు. ట్రెజరీల్లో ఆమోదం పొంది ఏడాదిగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. బకాయి ఉన్న మూడు డీఏలను ప్రకటించాలని కోరారు. జులై ఒకటో తేదీ నుంచి నూతన వేతన సవరణ అమలు జరిగేలా తెలంగాణ రెండో పీఆర్సీపై నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. పై సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి ఐక్యంగా ఉద్యమిస్తే సానుకూల ఫలితాలు వచ్చే అవకాశముంటుందని, అందుకు యూఎస్‌పీసీగా అన్ని సంఘాలతో చర్చించటానికి చొరవ తీసుకోవాలని సమావేశం తీర్మానించిందని పేర్కొన్నారు.