– మంత్రి వ్యాఖ్య.. భగ్గుమన్న విపక్షాలు
న్యూఢిల్లీ: 140 కోట్లమంది దేశ ప్రజల్లో 3000 మందిని పిలిచి, ఆకలేస్తుందా అని వారిని పశ్నించి ఆకలి సూచీని లెక్కిస్తారంటూ కేంద్రమంత్రి స్మతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె మాటల్లో దయ లేదని, అజ్ఞానం కనిపిస్తోందని కాంగ్రెస్ దుయ్యబట్టింది. ఈ ఏడాది విడుదలైన హంగర్ ఇండెక్స్ నివేదిక ప్రకారం భారత్ 111వ స్థానంలో ఉంది. ఆకలి సూచీలో పాకిస్థాన్(102) కంటే వెనకబడి ఉండటాన్ని ప్రశ్నిస్తూ.. స్మతి స్పందించారు. ‘భారతదేశ స్టోరీని ఇలాంటి సూచికలు అంచనావేయవు. ఉద్దేశపూర్వకంగా అలా జరగొచ్చు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లెక్కలను చాలామంది తోసిపుచ్చుతుంటారు. ఇండెక్స్ రూపకర్తలు.. భారత్లోని 140 కోట్ల మంది ప్రజల్లో 3000 మందిని పిలిచి, ఆకలి వేస్తుందా..? అని ప్రశ్నించి ఈ సూచీని రూపొందిస్తారు. ఆ ఇండెక్స్ ప్రకారం.. భారత్ కంటే పాకిస్థాన్ మెరుగ్గా ఉంది. అది సాధ్యమా..?’ అని మంత్రి వ్యాఖ్యలు చేశారు. ‘ఇంతకంటే సిగ్గుచేటు ఏమీ ఉండదు. మీ మాటల్లో మీ అజ్ఞానం కనిపిస్తోంది. కొంతమందిని పిలిచి, ఆకలిగా ఉందా అని అడిగి, ఈ సూచీని సిద్ధం చేస్తారని మీరు నిజంగా భావిస్తున్నారా..?’అని కాంగ్రెస్ నేత సుప్రియా ష్రినేట్ ట్వీట్ చేశారు. ‘మీరు భారత ప్రభుత్వంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. మీ నుంచి ఇలాంటి మాటలు వినడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. పిల్లల్లో వయసుకు తగ్గ ఎదుగుదల, పౌష్టికాహారలోపం వంటి నాలుగు సూచికల ఆధారంగా ఈ సూచీని రూపొందిస్తారు’ అని గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘ఆకలిని అపహాస్యం చేయొద్దు. మీరు ఎక్కడికి వెళ్లినా తగినంత ఆహారం అందుబాటులో ఉంటుంది’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మంత్రిగారు.. అహంకారానికి మరో రూపంగా ఉన్నారు’ అంటూ శివసేన నేత ప్రియాంకా చతుర్వేది మండిపడ్డారు.