– స్పష్టత ఇచ్చిన సీఈసీ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
శాసనసభ ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా జరపడానికి ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) మార్గదర్శకాలు జారీ చేసింది. అదేసమయంలో క్షేత్రస్థాయి పోలింగ్ అధికారుల సందేహాలకూ స్పష్టత ఇచ్చింది. పోలింగ్ సమయంలో ఒకరికి బదులు మరొకరు ఓటు వేయకుండా నిరోధిస్తూ, అసలైన ఓటర్లను గుర్తించాలని పేర్కొంది. ఓటు వేసే ముందు ఓటరు పోలింగ్స్టేషన్లోని అధికారులకు ఫొటోతో ఉన్న ఓటరు గుర్తింపు కార్డును చూపాలి. ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే ఫొటోతో ఉన్న ఈ క్రింది ధృవీకరణ పత్రాలను చూపించొచ్చు. 1. ఆధార్ కార్డ్ 2. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్ 3. ఫోటోతో ఉన్న బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ పాస్బుక్లు 4. కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్ 5. డ్రైవింగ్ లైసెన్స్ 6. పాన్ కార్డు 7. జాతీయ జనాభా రిజిస్టరు జారీ చేసిన స్మార్ట్ కార్డ్, 8. భారత పాస్పోర్ట్, 9. ఫోటోతో ఉన్న పింఛను పత్రం, 10. ఉద్యోగులకు కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు / ప్రభుత్వ సంస్థలు / పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డులు 11. చట్ట సభల సభ్యత్వాన్ని చూపే అధికారిక గుర్తింపు కార్డులు 12. దివ్యాంగుల గుర్తింపు కార్డులు చూపించొచ్చు. ఓటరు గుర్తింపు నిర్ధారణ సమయంలో క్లరికల్ తప్పులు, స్పెల్లింగ్ తప్పులవంటి వాటిని పోలింగ్ అధికారులు విస్మరించాలని సీఈసీ స్పష్టత ఇచ్చింది. మరొక అసెంబ్లీ నియోజకవర్గం రిజిస్ట్రేషన్ అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డును ఓటరు చూపితే, ఆ ఓటరు పేరు పోలింగ్ స్టేషన్కు సంబంధించిన ఓటర్ల జాబితాలో ఉంటే, దాన్ని గుర్తింపుకోసం అనుమతించవచ్చని తెలిపింది. భారత పాస్పోర్ట్లోని వివరాల ఆధారంగా ఓటర్ల జాబితాలో నమోదైన ప్రవాస ఓటర్లను పోలింగ్ స్టేషన్లో, వారి అసలు పాస్పోర్ట్ ఆధారంగా మాత్రమే గుర్తించాల్సి ఉం టుందనీ, దీనికి ఇతర ఏ గుర్తింపు పత్రం పరిశీలించ కూడదని స్పష్టత ఇచ్చింది. ఓటరు తన పోలింగ్ స్టేషన్, ఓటర్ల జాబితాలోని క్రమ సంఖ్యను, పోలింగ్ తేదీ, సమయంవంటి వివరాలు తెలుసుకోవడానికి వీలుగా ‘ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్’ జారీ చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. జాబితాలో ఉన్న ఓటర్లు అందరికీ పోలింగ్ తేదీకి కనీసం ఐదు రోజుల ముందు ఓటరు సమాచార స్లిప్ అందించాలని పేర్కొంది. ఓటర్ల గుర్తింపును నిర్ధారించ డానికి ఓటర్ స్లిప్పులను అంగీకరించబోరని తెలిపింది.