– బ్రిక్లో 103వ ర్యాంకుకు పడిపోయిన భారత్
న్యూఢిల్లీ : ప్రతిభలో పోటీతత్వానికి సంబంధించిన అంతర్జాతీయ సూచికలో మన దేశం స్థానం మరింత దిగజారింది. బ్రిక్ సభ్య దేశాలకు సంబంధించినంత వరకూ పది సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా ఈ నెల ప్రారంభంలో 83వ ర్యాంకు నుండి 103వ ర్యాంకుకు పడిపోయింది. మొత్తం 134 బ్రిక్ సభ్య దేశాల తాజా ర్యాంకులను ప్రకటించారు. అల్జీరియా 102వ స్థానంలో, గౌటెమాలా 104వ ర్యాంకులో ఉండగా మన దేశం వాటి మధ్యలో స్థానాన్ని పొందింది. ఈ మూడు దేశాలనూ దిగువ మధ్య తరగతి ఆదాయం కలిగిన దేశాలుగా పరిగణించారు. భారత్ కంటే ర్వాండా, పరాగ్వే, తునీసియా, నమీబియా, బొలీవియా, ఘనా, ఎల్ సాల్వెడార్, గాంబియా, కెన్యా, మొరాకో, ఎస్వతిని దేశాలు మంచి ర్యాంకులు పొందాయి. ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్స్ ఐఎన్ఎస్ఈఏడీ ఈ సూచికను రూపొందించింది. బ్రిక్ దేశాల్లో చైనా 40వ ర్యాంకుతో అగ్ర స్థానంలో నిలవగా రష్యా 52వ ర్యాంకులో, దక్షిణాఫ్రికా 68వ ర్యాంకులో, బ్రెజిల్ 69వ ర్యాంకులో ఉంది.
2020 వరకూ మన దేశం ప్రతిభకు సంబంధించిన పోటీతత్వంలో మంచి ర్యాంకింగ్లోనే కొనసాగింది. ఆ తర్వాత వరుసగా మూడేళ్ల పాటు అది తగ్గుతూ వస్తోంది. బ్రిక్ దేశాలను కలుపుకొని మొత్తంగా చూస్తే సింగపూర్, స్విట్జర్లాండ్, అమెరికా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. తొలి 25 ర్యాంకింగుల్లో యూరోపియన్ యూనియన్ దేశాల ఆధిపత్యమే కన్పించింది. తొలిసారి మొదటి 25 స్థానాల రేసు నుండి జపాన్ వైదొలిగింది. ఆ స్థానంలో దక్షిణ కొరియాకు చోటు దక్కింది.