జబాలియా శరణార్థి శిబిరంపై దాడి

Attack on Jabalia refugee camp– 200 మంది మృతి
గాజా సిటీ: గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయిల్‌ వరుసగా మూడు రోజులపాటు జరిపిన బాంబు దాడుల్లో 200 మంది చనిపోయారు. శనివారం ఒక్కరోజే రెండు దాడుల్లో 80 మంది చనిపోయారు. వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. మృతి చెందిన వారిలో 19 మంది చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన 32 మంది ఉన్నారు. ఆరు వారాల యుద్ధంలో 16 లక్షల మంది పాలస్తీనియన్లు నిరాశ్రయులైన గాజాలోని అతిపెద్ద శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్‌ దాడి చేస్తూనే ఉంది. గాజాలోని అల్‌-ఫఖురా పాఠశాలపై జరిగిన దాడిలో కనీసం 50 మంది మరణించారు. ఇది యుద్ధం ప్రారంభమైనప్పుడు శరణార్థుల కేంద్రంగా మార్చబడిన పాఠశాల. శనివారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. అదే సమయంలో, ఇజ్రాయెల్‌ సైన్యం స్వాధీనం చేసుకున్న అల్‌ షిఫా ఆస్పత్రి నుంచి ప్రజలను భారీగా తరలిస్తున్నారు. రోగులు, ఆరోగ్య కార్యకర్తలు, శరణార్థులతో సహా 7,000 మందికి పైగా ప్రజలు ఇక్కడ ఉన్నారు. ప్రజలు గుంపులుగా బయటకు వెళ్తున్న దృశ్యాలను అంతర్జాతీయ మీడియా శనివారం విడుదల చేసింది. శుక్రవారం రాత్రి ఆస్పత్రిలో భారీ పేలుడు సంభవించింది.నాలుగో రోజు కూడా ఇజ్రాయెల్‌ సైన్యం ఆసుపత్రిలో మకాం వేసింది. 120 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉందని, నవజాత శిశువులు ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉన్నారని హమాస్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, ఇజ్రాయెల్‌ మాత్రం తాము తరలింపు ఉత్తర్వు జారీ చేయలేదని వాదిస్తోంది. ఇజ్రాయెల్‌ సైన్యం హమాస్‌ కేంద్రంగా ఉందని ఆరోపిస్తూ ఆసుపత్రిని పాక్షికంగా కూల్చివేస్తోంది.దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌లోని హమద్‌ పట్టణంలో ఇజ్రాయెల్‌ బాంబు దాడిలో చిన్నారులతో సహా 28 మంది మరణించారు. గాజాలో ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో మరణించిన వారి సంఖ్య 12,000 కు చేరుకుంది. గాజాలోని ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలు శనివారం రఫా సరిహద్దు మీదుగా ఒక ట్రక్కు ఇంధనం అందిందని తెలిపాయి.
ఇజ్రాయెల్‌ లెబనాన్‌
దక్షిణ లెబనాన్‌లోని ఇజ్రాయెల్‌ అల్యూమినియం ప్లాంట్‌పై క్షిపణి దాడి చేసింది. నబాతిV్‌ా పట్టణంలోని ప్లాంట్‌పై శనివారం రెండుసార్లు దాడి జరిగింది. గాజాపై ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, లెబనీస్‌ సరిహద్దులో సాయుధ సమూహం హిజ్బుల్లాతో పోరాటం తీవ్రంగా ఉంది.గాయపడిన పాలస్తీనా చిన్నారులు అరబ్‌ ఎమిరేట్స్‌కు చేరుకున్నారు. ఇజ్రాయెల్‌ దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారులతో తొలి విమానం యూఏఈకి చేరుకుంది. గాజాలో గాయపడిన 1,000 మంది చిన్నారులకు చికిత్స అందించేందుకు యూఏఈ ముందుకొచ్చింది. దీని ప్రకారం, గాయపడిన పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో సహా 15 మందితో కూడిన మొదటి విమానం అబుదాబికి చేరుకుంది. ఇందులో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్లలు కూడా ఉన్నారు.