మరో 20 మంది బాలలను రక్షించిన ఏహెచ్‌టీ అధికారులు

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ విభాగం అధికారులు మరో 20 మంది బాల, బాలికలను వెట్టిచాకిరి నుంచి రక్షించారు. వీరిని అక్రమంగా తీసుకొచ్చి పని చేయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా శ్రీరామపురంలో ఇసుక బట్టీల్లో అక్రమంగా బాల,బాలికల చేత వెట్టి చాకిరి చేయిస్తున్నారనీ యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ విభాగం అధికారులకు సమాచారమందింది. దీంతో అక్కడ దాడులు నిర్వహించిన అధికారులు మొత్తం 20 మంది బాలలను రక్షించారు. ఇటు బట్టీల్లో పని చేస్తున్న వీరిలో 13 మంది బాలికలు, ఏడుగురు బాలురు ఉన్నారు. వీరిని బయటి రాష్ట్రాల నుంచి నరసింహ అనే కాంట్రాక్టర్‌ అక్రమంగా తీసుకొచ్చి పని చేయిస్తున్నారని విచారణలో తేలింది. దీంతో అధికారులు నరసింహతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.