స్వరాష్ట్ర సాధన ఉద్యమ అమర వీరులకు జోహార్లు

నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర దశాబ్ది వేడుకలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో అసువులు బాసిన అమర వీరులకు జోహార్లు అర్పిస్తున్నానని నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అన్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను నిర్వ హించారు. ఈ సందర్భంగా మేయర్‌ పోలీసు వందనం స్వీకరించి జాతీయ జెండా ఎగరేసిన అనంతరం మాట్లాడుతూ నీళ్ళు, నిధులు నియమకాల కోసం 14 ఏండ్ల పాటు సుదీర్ఘంగా సాగిన తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల ఆత్మ బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం దశాబ్దానికి చేరుకుంటున్నదన్నారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడం వల్ల ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి సంక్షేమ పథకాలను వినూత్న పద్దతిలో అమలు చేసి దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలిచేలా చేశారన్నారు. జీహెచ్‌ఎంసీ మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన ప్రజా రవాణా కోసం ఆధునిక రోడ్డు వ్యవస్థ, సంక్షేమం, సామాజిక, ఆర్థిక పరమైన అభివృద్ధికి నగర వాసులకు జీహెచ్‌ఎంసీ ద్వారా పూర్తి తోడ్పాటు అందిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌ కుమార్‌, ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి, అడిషనల్‌ కమిషనర్‌ ప్రియాంక అలా, ఈఎన్‌సీ జియా ఉద్దీన్‌, ప్రాజెక్ట్‌ సీఈ దేవానంద్‌, అడిషనల్‌ కమిషనర్లు సరోజ, విజయలక్ష్మి, జయరాజ్‌ కెనడీ, యాదగిరిరావు, సీసీపీ దేవేందర్‌ రెడ్డి, అడిషనల్‌ సీసీ శ్రీనివాసరావు, హౌసింగ్‌ ఎస్‌ఈ విద్యాసాగర్‌, ప్రాజెక్ట్‌ ఎస్‌ఈలు వెంకటరమణ, రవీందర్‌ రాజు, ఎస్‌డబ్ల్యూఎం కోటేశ్వరరావు, చీఫ్‌ ఎంటమాలజిస్ట్‌ డా.రాంబాబు తదితర విభాగాల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.