గుర్తింపు లేని సదాశివ ఇంటర్నేషనల్‌ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలి

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాథోడ్‌ సంతోష్‌
నవతెలంగాణ-మేడ్చల్‌
మేడ్చల్‌ పట్టణంలోని కేఎల్‌ఆర్‌ వెంచర్‌లో గుర్తింపు లేకుండా నడుపుతున్న సదాశివ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ పై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాథోడ్‌ సంతోష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ఎలాంటి గుర్తింపు లేకుండా విద్య సంవత్సరం ప్రారంభించాలనుకుంటున్న స్కూల్‌కు సంబంధించిన బ్యానర్స్‌ తీసివేసి,స్కూల్లో అమ్ముతున్న బుక్స్‌, యూనిఫామ్స్‌, తరగతిగది, స్కూల్‌ను, మండల విద్యాధికారులు సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్తింపు లేని పాఠశాలలు మండల విద్యాధికారుల కనుసందనంలో నడుస్తున్న పట్టించు కోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. విచ్చలవిడిగా ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు, బుక్స్‌, యూనిఫామ్స్‌, అమ్ముతున్నా విద్యాధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలు, అనుమతి పొందిన తరగతులు కన్నా ఎక్కువ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసి అడ్మిషన్‌ తీసుకొని దందాలు నడిపిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నత అధికారులు ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలను సందర్శించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి కిరణ్‌, శివ, మనోహర్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.