మణిపూర్‌ మంటలు ఆరవెందుకు?

మణిపూర్‌ 67రోజులుగా మండుతోంది. ఇప్పటికే నూట ఇరవైకి మందికి పైగా చనిపోయినట్టు వార్తలు. నాలుగు రోజుల కిందట కూడా ఈ గొడవల్లో ముగ్గురు మరణించారు. ప్రధాని మౌనం వహించారని ప్రతిపక్షాల, సామాజిక ఉద్యమ కారుల విమర్శ. మణిపూర్‌ గురించి ప్రధాని రోజూ చర్చిస్తున్నారని కేంద్ర గృహమంత్రి అమిత్‌ షా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేంద్ర సింగ్‌ అన్నారు. జర్మన్‌ నియంత హిట్లర్‌ కూడా మౌనమునే. గృహమంత్రి హీన్రిచ్‌ హిమ్లర్‌, చైతన్య ప్రచార మంత్రి జోసెఫ్‌ గోబెల్స్‌, ఆర్మీ ఛీఫ్‌ ఫీల్డ్‌ మార్షల్‌ ఎర్విన్‌ రోమెల్‌, శాఖారహిత మంత్రి జర్మన్‌ వాయుసేన అధిపతి హెర్మన్‌ గోరింగ్‌లతో మాత్రమే మంతనాలాడేవారు. కశ్మీర్‌, లక్షద్వీప్‌ ఘటనలతో మణిపూర్‌ మంటలకు సారూప్య ముంది. రాజ్యాంగ అధికరణలు 370, 35ఎ కశ్మీర్‌ ప్రజలకు భూమిపై హక్కులనిచ్చాయి. వీటి రద్దుతో కశ్మీర్‌ భూములను ఆశ్రిత కార్పొరేట్‌ సంస్థలకు అప్ప జెప్పారు. లక్షద్వీప్‌లో కేంద్ర అడ్మినిస్ట్రేటర్‌ రాజ్యాంగ పరిమితిని దాటి చట్టాలు చేశారు. ప్రకృతి వనరులను, సుందర సముద్ర తీరాలను, జనులు లేని ద్వీపాలను కార్పొరేట్లకు పంచారు. నేటి మణిపూర్‌ అల్లర్లకు పాలక వర్గాల ఇలాంటి చర్యలే కారణం.
2017లో బీజేపీ 21 సీట్లతో మణిపూర్‌లో ఎత్తుగడలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైదిక మతవాద అధిక సంఖ్యాక మేతేయిలను, సనమహిలను సంఫ్‌ సంస్థలు సంఘటితపర్చి గిరిజన కుకిలపై దాడిచేశాయి. కుకిలతో ఆస్తులు, ఆవాసాలు, పొరుగు పంచుకోవద్దని గతేడాది ఎన్నికల్లో బీరేన్‌సింగ్‌ మేతేయిలకు చెప్పారు. ఈ గుజరాత్‌ హిందూత్వ నమూనాను మేతేయిలు పాటించారు. క్రైస్తవులుగా మారిన మేతేయిలనూ తరిమేశారు. కుకిలు, నాగాలు మణిపూర్‌ లోయలో పిల్లలను చదివించుకుంటారు. చిన్న పనులతో అద్దెఇళ్ళలో బతుకుతారు. మేతేయిల చర్యలతో పిల్లల చదువు, పెద్దల బతుకుదెరువు ఆగమయ్యాయి. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే, శాంతిభద్రతలు, జీవన ప్రమాణాలు పెంచుతామని ప్రధాని ప్రచారం చేశారు. 36వేర్పాటువాద సంస్థల్లో ప్రభుత్వంలో భాగస్వాములైన మేతేయిల తీవ్రవాద సంస్థల నిర్వహణ ఆంక్షలను 2022 ఏప్రిల్‌లో ఎత్తేశారు. అవి విజృంభించాయి. మేతేయిలకు షెడ్యూల్డ్‌ ట్రైబ్‌ హోదా ఇస్తామని ప్రధాని వాగ్దానం చేశారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటుతో రాజకీయ ప్రాతినిధ్యం సాధించలేని మారుమూల ప్రాంతాల గిరిజనులకు రాజ్యాంగం షెడ్యూల్డ్‌ ట్రైబ్‌ హోదాను ఇచ్చింది. ఈ అర్హతలేని మేతేయిలకు ఈ హోదా ఎలా ఇస్తారు? ఆ హోదా కోసం మేతేయిలు ఉద్యమించారు. మేతేయి తీవ్రవాద సంస్థలు, సంఫ్‌ు వత్తాసు పలికాయి. దీనికి గిరిజనులు నిరసన తెలిపారు. దీన్ని అడ్డుకునేందుకు మేతేయిలు హింసకు పాల్పడ్డారు.
రాష్ట్రంలో మయన్మార్‌ వలసదార్లు చొరబడ్డారని సంఫ్‌ు ప్రచారం. మణిపూర్‌లో విదేశీయుల ప్రవేశానికి నియంత్రిత ప్రాంత అనుమతి కావాలి. ఇది 10రోజులకే ఇస్తారు. అక్రమ వలసదారులు రాలేరు. మయన్మార్‌ చిన్‌ తెగ వలసదార్లు, అధికారుల నిర్లిప్తతతో మణిపూర్‌లో చొరబడ్డారు. మయన్మార్‌ రోహింగ్య ముస్లింలను అడ్డుకున్న కేంద్రం వీరిని ఆపలేదు. 2013లో బీజేపీ ప్రభుత్వాలు గుజరాత్‌, రాజస్థాన్‌, హరియాణాలకు వైదిక మతస్తులను రానిచ్చాయి. వారికి పౌరసత్వం, ఓటు హక్కు ఇచ్చాయి. సాధారణ ఎన్నికల్లో సీట్లు పొందారు. ఇదే ప్రయోజనాన్ని ఆశించి కేంద్ర రాష్ట్ర పాలకులే మణిపూర్‌లోకి బర్మీయులను రానిచ్చారని అనుమానం. కుకిలు నివసించే మణిపూర్‌ పర్వత ప్రాంతాల్లో బొగ్గు నిలువలున్నాయి. ఇటీవల పెట్రోలియం నిక్షేపాలు బయటపడ్డాయి. వాటిని తమ కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెట్టాలని బీజేపీ పాలకుల పన్నాగం. రక్షిత, వన్యప్రాణ అభయారణ్య అడవుల సాకుతో కుకిల భూములను ఆక్రమించారు. పారిని అక్కడి నుండి తరిమేశారు. కుకిలలో మాదకద్రవ్యాల అలవాటు, ఎయిడ్స్‌ వ్యాధి ఎక్కువ. యువత నిర్వీర్యమైంది. కుకిలు నల్లమందు పండిస్తున్నారని నేరాలు మోపారు. నల్లమందు తోటలను ధ్వంసం చేశారు. నల్లమందు పండించడం నేరం కాదు. మత్తు పదార్థాల, మాదక ద్రవ్యాల తయారీ నేరం. మేతేయి వాణిజ్యవేత్తలే ఈ పని చేస్తారు. పాలకవర్గ మేతేయిల డ్రగ్‌ సిండికేట్‌లు కుకిల నుండి నల్లమందు పంటను నామమాత్రపు ధరకు కొంటారు. పంటతో సహా నల్లమందు వ్యాపారాన్ని సొంతం చేసుకోవాలని డ్రగ్‌ సిండికేట్‌ల పథకం. ఇటీవల పోలీసులు నల్లమందు ముఠాలను అరెస్టు చేశారు. వారిలో ముఖ్యమంత్రి బంధువులున్నారు. ఆర్థిక అసమానతలు, పేదరికం, నిరుద్యోగం, జాతుల వైషమ్యాలు కుకిలను నల్లమందు పంటవైపునకు, గిరిజన స్త్రీలను వ్యభిచారం వైపునకు నెట్టాయి.
మణిపూర్‌లో క్రైస్తవ జనాభా పెరిగిందని, వారు మేతేయిలను దాటిపోతారని సంఫ్‌ు ప్రచారం. దేశంలో ముస్లింలు పెరిగి హిందువులను అపాయంలో ముంచుతారన్న ప్రచారం లాంటిది. 1961-2011 మధ్య 50ఏండ్లలో క్రైస్తవులు 5లక్షలు పెరిగారు. వైదికమతస్తులూ పెరిగారు. కాలక్రమంలో పెరిగిన జనాభా, ఓట్ల కోసం పాలకులు అనుమతించిన వలసలు, వైదికమత వివక్షను భరించలేక క్రైస్తవం పుచ్చుకున్నవారు ఈ పెరుగుదలకు కారణం. శాతాలతో మోసం చేస్తున్నారు. రూపాయికి రూపాయి కలిపితే 100శాతం పెరుగుదల. 1,000కి వంద కలిపితే పెరిగేది 10శాతం. 100 కంటే రూపాయి తక్కువ. క్రైస్తవమత పెరుగుదలను అరికట్టడానికి జాతీయ పౌరసత్వ, జాతీయ జనాభా జాబితాలను తయారుచేయమని, 1951 జనాభా ప్రకారం పౌరసత్వాన్ని సవరించమని సంఫ్‌ు గొడవచేసింది. 1961 జనాభా ప్రకారం పౌరసత్వాన్ని సవరిస్తే 80శాతం కుకిలు పౌరసత్వం కోల్పోతారు. 1951 ఆధారంగా సవరిస్తే 95శాతం కుకిలు, నాగాలు పౌరసత్వం కోల్పోయి రాష్ట్రాన్ని వదలాలి. ఈ అల్లర్లలో ఆరువేలు ఆయుధాలు భాండాగారాల నుండి చోరీ అయ్యాయి. ఒక్కటీ పట్టుబడలేదు. వెయ్యి ఆయుధాలే పోయాయని, 200 రికవరీ చేశామని ముఖ్యమంత్రి చెప్పారు. అల్లర్లు జరిగిన చురాచందపుర్‌ ప్రాంతంలోనే కాక రాష్ట్రమంతా చోరీలు జరిగాయి. చిన్న కారణాలకే సామాన్యులను చంపే పోలీసులు వీరిని ఎందుకు కాల్చలేదు? అన్ని స్టేషన్లలో భద్రతారాహిత్యం, నిర్లిప్తత ఎలా వచ్చాయి? కేంద్ర, సైనిక, ప్రత్యేక దళాల భాండాగారాల జోలికి పోకుండా రాష్ట్ర రక్షణదళాల భాండాగారాల నుంచే చోరీ జరిగింది. పాలకుల, అధికారుల మద్దతు లేనిదే ఇలా జరుగుతుందా? దోపిడీ ఆయుధాలు సంఫ్‌ సంస్థలకు చేరాయని అనుమానం.
రాష్ట్రం కాలుతున్నప్పటి నుండి మణిపూర్‌ పాలక వర్గాలు 45 ట్వీట్లు చేశాయి. వాటిలో 13 మాత్రమే మణిపూర్‌కు సంబంధించినవి. మిగిలినవి కేంద్ర పాలకుల ట్వీట్ల రిట్వీట్లే. రాహుల్‌ గాంధీని ఎగతాళిచేసేవి, ఇందిర ఎమర్జెన్సీ, 1984 సిక్కుల ఊచకోత, 1985 షా బానో కేసు లింగవివక్షతల గురించిన విమర్శలే. రోమ్‌ కాలుతుంటే ఫిడేల్‌ వాయిస్తూ నీరో చక్రవర్తే వినోదించారు. నేటి ఇండియాలో సామంతులూ నీరోలే. చనిపోయినవారిలో 98శాతం, పారిపోయినవారిలో 70శాతం కుకిలు. 120మంది చనిపోగా, 500మంది గాయపడ్డారు. 20వేల ఇళ్ళు కూలాయి. 6,500 మంది పారి పోయారు. కుకిల ఆస్తులు, వాహనాలే బూడిదయ్యాయి. కుకిలను తీవ్రవాదులుగా చిత్రించి పాలకవర్గ అధికారులే చంపారు. 200చర్చిలు, 17గుళ్లు, 124గిరిజన గ్రామాలు, 1700 కుకిల ఇండ్లు నేలమట్టమయ్యాయి. వీరు తిరిగి రావడానికి సైన్యం సహాయం కోరుతున్నారు. గిరిజనులు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకొని మయన్మార్‌ సైనిక ఝుంఠా మణిపూర్‌లో చొరబడగలదు.
రెండు నెలలుగా ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద మహిళలు, క్రీడాకారులు, కళాకారులు, మేధావులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ, 550మంది పౌరసమాజ ప్రతినిధులు, కేంద్ర పాలకులు జోక్యం చేసుకోవాలని, హత్యలను, హింసను, దమనకాండను ఆపాలని ఉత్తరాలు రాశారు. అయినా ప్రధాని, రాష్ట్రపతి పట్టించుకోలేదు. సుత్తి చేతిలో ఉన్నవాడికి ప్రపంచమంతా మేకే. బీజేపీ పాలకుల వద్ద మతోన్మాద, అధికార, ధనబల, ప్రభుత్వ విభాగాల సుత్తులు ఉన్నాయి. సామాన్య ప్రజానీకం, గిరిజనులు, ముస్లింలు, క్రైస్తవులు వారికి మేకుల్లాగా కనిపిస్తున్నారు. అగ్ని ప్రమాదాన్ని ఆర్పచ్చు. రక్షకులే కాల్చితే ఆర్పేదెవరు?
సంగిరెడ్డి హనుమంతరెడ్డి 
సెల్‌: 9490204545