న్యూఢిల్లీ : యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) కేసుల సంఖ్య ఆందోళనను కలిగిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. నివేదించబడిన కేసుల సంఖ్య 2017లో 25,833 నుంచి గతేడాది డిసెంబర్ వరకు 119,686కి చేరి గతేడాది డిసెంబర్ వరకు 4.5 రెట్లు పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. ఏఎంఆర్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)మొదటి 10 ప్రపంచ ప్రజారోగ్య ముప్పులలో ఒకటిగా గుర్తించింది. రోగులలో యాంటీబయాటిక్స్ విఫలమవడం ప్రారంభించటంతో ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడినందున భారతదేశంలో అటువంటి ప్రతిఘటన పెరుగుతుందని డేటా వివరించింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో యాంటీబయాటిక్స్ వినియోగం విరివిగా ఉండటంతో ఏఎంఆర్ ప్రమాదాన్ని పెంచింది. వార్షిక ఏఎంఆర్ నిఘా వ్యాయామంలో భాగంగా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) ద్వారా డేటా రూపొందించబడింది. రోగులలో దాదాపు మూడింట ఒకవంతు మంది 36 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఉన్నారు. అయితే కొంతమంది రోగులు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు కావటం గమనార్హం. ది లాన్సెట్ ప్రకారం, 2019లో ప్రపంచవ్యాప్తంగా 12.7 లక్షల మరణాలకు ఏఎంఆర్ కారణమైంది. ఏఎంఆర్ కారణంగా భారతదేశంలో వద్ధుల మరణాలు అత్యధికంగా ఉన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.