కేజీబీవీ పాఠశాల తనిఖీ చేసిన ఎంఈవో

నవతెలంగాణ పెద్దవంగర: మండల పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మండల విద్యాశాఖ అధికారి గుగులోతు రాము నాయక్, మండల నోడల్ ఆఫీసర్ అల్లందాసు బిక్షపతి తో కలిసి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నెలకొన్న సమస్యలు, భోజన వసతిపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేస్తున్న వంటలను, స్టోర్ రూం, పాఠశాల రికార్డులను, పాఠ్యాంశాల బోధన తీరును పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, ఉత్తమ బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారి గంగారపు స్రవంతి, ఉపాధ్యాయునీలు సీహెచ్ కల్యాణి, శ్రీలత, సరిత, సైదమ్మ, సంధ్య, కల్యాణి, బోధనేతర సిబ్బంది పద్మ, మహేశ్వరి, జ్యోతి, సుజాత, సుమలత తదితరులు పాల్గొన్నారు.