హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర…

– మార్చి 16 నుంచి ప్రారంభం
– ఏఐసీసీ గ్రీన్‌ సిగల్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ యాత్ర ఈ నెల 16 నుంచి జూన్‌ 15 వరకు 91 రోజులపాటు పాదయాత్ర చేయనున్నట్టు ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ నియోజకవర్గం, బజరహత్నూర్‌ మండలం, పిప్పిరి గ్రామం నుంచి పాదయాత్ర చేస్తానన్నారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఏలేటి మహేశ్వర్‌రెడ్డితో కలిసి ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి విలేకర్లతో మాట్లాడారు. ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు 39 నియోజకవర్గాల్లో 1365 కిలోమీటర్ల మేర పాదయాత్రకు రూపకల్పన చేసినట్టు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగనే తెలంగాణ లక్ష్యాలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు పాదయాత్రలో భాగంగా మంచిర్యాల, హైదరాబాద్‌ శివారు ప్రాంతం, ఖమ్మంలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు.