1న హెచ్‌ఐసీసీలో స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు

– ముఖ్యఅతిధిగా సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలను వచ్చేనెల ఒకటిన హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ఈ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఆమె నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి, దేశపతి శ్రీనివాస్‌, డీజీపీ అంజనీకుమార్‌లతో సహా పలువురు కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎస్‌ శాంతి కుమారి మాట్లాడుతూ ఈ వజ్రోత్సవ ముగింపు ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారని అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు, మేయర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, జిల్లా పరిషత్‌ చైర్మెన్లు, జెడ్పీటీసీలు, మండల పరిషత్‌ అధ్యక్షులు. డీసీసీబీ, డీసీఎంఎస్‌, రైతు బంధు సమితిల అధ్యక్షులు, ఆల్‌ ఇండియా సర్వీస్‌ అధికారులతో సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రంలో భాగంగా దాదాపు గంటసేపు దేశభక్తి, స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని కలిగించే పలు సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి సందేశం ఉంటుందని ఆమె వెల్లడించారు. ఈ వజ్రోత్సవ ముగింపు వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సంబంధిత అధికారులందరూ విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.