ఖర్గే గురించి మాట్లాడే అర్హత హరీశ్‌కు లేదు

– మహేష్‌కుమార్‌గౌడ్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గురించి మాట్లాడే అర్హత మంత్రి హరీశ్‌రావుకు లేదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఖర్గే చరిత్ర ఏంటో హరీశ్‌రావు తెలుసుకుంటే మంచిది. ఖర్గే దళితవర్గంలో పుట్టి ఏఐసీసీ అధ్యక్షులు అయ్యాడు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ మా నిబద్ధత. నిదర్శనం. గత తొమ్మిదేండ్లుగా బీఆర్‌ఎస్‌ దళితులను మోసం చేస్తూనే ఉన్నది. రాష్ట్ర సంపదను కల్వకుంట్ల కుటుంబం కొల్లగొట్టింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలకు డిపాజిట్లు రావు. సెప్టెంబర్‌ 2వ తేదీన షాద్‌నగర్‌లో బీసీ డిక్లరేషన్‌ సభ ఉంటుంది’ అని తెలిపారు.