కాంట్రాక్టు అధ్యాపకుల పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి

– ఇంటర్‌ విద్యా కమిషనర్‌కు టీజీజేఎల్‌ఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల పెండింగ్‌ వేతనాలను చెల్లించాలని తెలంగాణ గెజిటెడ్‌ జూనియర్‌ లెక్చరర్ల అసోసియేషన్‌ (టీజీజేఎల్‌ఏ-475) కోరింది. ఈ మేరకు ఇంటర్‌ విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌కు సోమవారం ఆన్‌లైన్‌ ద్వారా ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వస్కుల శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్‌ వినతిపత్రం సమర్పించారు. ఈ ఏడాది మార్చికి సంబంధించి మహబూబ్‌నగర్‌, ఖమ్మం, హన్మకొండ జిల్లాల్లో కొన్ని కాలేజీల్లో పనిచేసిన కాంట్రాక్టు అధ్యాపకులకు వివిధ కారణాల వల్ల వేతనాలు అందలేదని తెలిపారు. మేకి సంబంధించి 449 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు 28 రోజుల వేతనాలు అందాల్సి ఉందని పేర్కొన్నారు. జూన్‌, జులై, ఆగస్టు వేతనాలు ఇంత వరకు అందలేదని వివరించారు.