కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం

–  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ-ప్రజ్ఞాపూర్‌
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధిక స్థానాలు కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుని అధికారంలోకి వస్తుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి సిద్దిపేట బయలుదేరిన ఆయనకు ప్రజ్ఞాపూర్‌ వద్ద గజ్వేల్‌ కాంగ్రెస్‌ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నా రన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ పట్టుకొమ్మల్లా పని చేస్తున్నారన్నారు. 9 ఏండ్ల బీఆర్‌ఎస్‌ పాలనకు ప్రజలు స్వస్తి పలికి కాంగ్రెస్‌ పార్టీని ఆదరిస్తారన్నారు. ఈ కార్య క్రమంలో కిసాన్‌ సెల్‌ జిల్లా కార్యదర్శి మొహ్మద్‌ అజ్గర్‌, యూత్‌ నాయకులు పంజల రవి, సల్మాన్‌, అనిల్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.