– సీఎం కేసీఆర్కు జూలకంటి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డీఎస్సీ-2008 కామన్ మెరిట్లో ఎంపికై నష్టపోయిన బీఎడ్ అభ్యర్థులకు న్యాయం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. వారికి న్యాయం చేస్తామంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. డీఎస్సీ-2008 నియామకాల్లో నిబంధనల మార్పు వల్ల సుమారు నాలుగు వేలకుపైగా బీఎడ్ అభ్యర్థులు ఉద్యోగావకాశాలు కోల్పోవడంతో తీవ్ర అన్యాయానికి గురయ్యారని తెలిపారు. కామన్ మెరిట్లో ఎంపికై నష్టపోయిన 1,200 మంది అభ్యర్థులు గత 13 ఏండ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారని వివరించారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత వారికి ఉద్యోగాలిస్తామంటూ 2016లో వరంగల్ మహాసభలో సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. ఆ ప్రకటనను ఆదర్శంగా తీసుకుని ఏపీ ప్రభుత్వం ఎమ్మెల్సీలు, విద్యాశాఖ అధికారులతో కమిటీ వేసి ఆ నివేదిక మేరకు జీవోనెంబర్ 39ని విడుదల చేసిందని తెలిపారు. వారిని మినిమం టైంస్కేల్ పద్ధతిలో 2021లో ఎస్జీటీలుగా నియమించిందని పేర్కొన్నారు. కానీ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ తెలంగాణలో ఇప్పటికీ నెరవేరలేదని తెలిపారు. మెరిట్ మార్కులు సాధించినా ఉద్యోగం రాకపోవడంతో వారు తీవ్రమైన నిరాశతో ఉన్నారని తెలిపారు. ఈ విషయంలో జాప్యం చేయకుండా స్వయంగా సీఎం జోక్యం చేసుకుని డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చి ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.