రాష్ట్రంలో యూరియా కొరత లేదు

There is no shortage of urea in the state–  కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు : మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో యూరియా కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరారు. శనివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో మంత్రి యూరియాపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ప్రత్యేక కమిషనర్‌ హన్మంతు, ఉద్యాన శాఖ సంచాలకులు హన్మంతరావు, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, అదనపు సంచాలకులు విజరు కుమార్‌, సంయుక్త సంచాలకులు కె. రాములు తదితరులు ఉన్నారు. ఈ వానాకాలం సీజన్‌కు 9.14 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా కేటాయించినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 7.78 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా చేసినట్టు పేర్కొన్నారు. మార్చి 31 నాటికి 2.15 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా ముందస్తు నిల్వలు పెట్టినట్టు తెలిపారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అందుబాటులో ఉంచిన యూరియా 9.93 లక్షల మెట్రిక్‌ టన్నులని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నిల్వలు 2.50 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉన్నాయని వివరించారు. ఈ ఏడాది రుతుపవనాల ఆలస్యం మూలంగా 10 లక్షల ఎకరాల సాగువిస్తీర్ణం తగ్గిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కేవలం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాలుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో కృత్రిమ యూరియా కొరతను సృష్టించి రాష్ట్రంలో యూరియా అందుబాటులో లేదని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యం లోనే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రంలో యూరియా లేదంటూ దుష్ప్రచారానికి తెరలేపారని విమర్శించారు. ఇది అవగాహనా రాహిత్యమే కాదు…దురుద్దేశ పూర్వకంగా చేస్తున్న ప్రయత్నమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.