తూకం ఎక్కువేస్తున్నారని అడిగినందుకు.. వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతుపై దాడి

నవతెలంగాణ- మల్లాపూర్‌
జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం నడికూడ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎక్కువ తూకం వేస్తున్నారని, హమాలీ చార్జీలు ఎక్కువగా వసూలు చేస్తున్నారని అదే గ్రామానికి చెందిన రైతు అప్పం చిన్నారెడ్డి ప్రశ్నించాడు. దాంతో కొనుగోలు కేంద్రంలో పని చేస్తున్న వ్యక్తి చిన్నారెడ్డిపై దాడి చేశాడు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ వడ్లు తూకం వేయడానికి ఎన్నో రోజులుగా ఎదురుచూడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో హమాలీ చార్జీలు క్వింటాకు రూ.40 రైతుల నుంచి వసూలు చేస్తున్నారన్నారు. ఎక్కువ తూకం, హమాలీ చార్జీలు ఎందుకు ఎక్కువ వసూలు చేస్తున్నారని ప్రశ్నించగా తనపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ రైతులు విమర్శిస్తున్నారు. గాయపడిన చిన్నారెడ్డిని మెట్‌పల్లి ఆస్పత్రికి తరలించారు. రైతు చిన్నారెడ్డి వడ్ల కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న వ్యక్తిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.