– డిస్కవరీ డెవలప్మెంట్ సెంటర్
– 1200 మందికి ఉపాధి అవకాశాలు
– న్యూయార్క్లో కేటీఆర్కు ఎన్ఆర్ఐల బృందం ఘనస్వాగతం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మీడియా, వినోద రంగానికి చెందిన ప్రఖ్యాత సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తెలంగాణలో పెట్టుబడి పెట్టబోతుంది. హెచ్బీఓ, హెచ్బీఓ మ్యాక్స్, సీఎన్ఎన్, టీఎల్సీ, డిస్కవరీ, డిస్కవరీప్లస్, డబ్ల్యూబీ, యూరోస్పోర్ట్, యానిమల్ ప్లానెట్, కార్టూన్ నెట్వర్క్, సినిమాక్స్, పోగో, టూన్కార్ట్, హెచ్జీ టీవీతో పాటు క్వెస్ట్ వంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టెలివిజన్, ఫిల్మ్, స్ట్రీమింగ్, కంటెంట్ బ్రాండ్లు, ఫ్రాంచైజీలు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థకు చెందినవే. గేమింగ్, స్ట్రీమింగ్తో పాటు ఎంటర్ టైన్మెంట్ రంగంలో భారత మార్కెట్లో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునే లక్ష్యంతో హైదరాబాద్లో డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటుచేసేందుకు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ మంత్రి కేటీఆర్తో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్) అలెగ్జాండ్రా కార్టర్ సమావేశమయ్యారు. తమ విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. ఇండియాలో తమ మార్కెట్ను సుస్థిరం చేసుకునే లక్ష్యంతో డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభిస్తామని అలెగ్జాండ్రా తెలిపారు. మొదటి సంవత్సరం 1200 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. వ్యాపారం పెరిగేకొద్ది మరింత మందికి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ పెట్టుబడి ప్రకటనపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థకు ప్రభుత్వం తరుపున సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. అంతకుముందు న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి కేటీఆర్కు ఎన్ఆర్ఐల బృందం ఘనంగా స్వాగతం పలికింది.