కోదాడ సంతలో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం

– కోడె దూడ మృతి ధర్నాకు దిగిన రైతులు
నవతెలంగాణ-కోదాడరూరల్‌
కోడెదూల విక్రయాల్లో తేడా రావడంతో దళారీ.. రైతుపై దాడి జరిగి రైతుకు తగలాల్సిన కర్ర కోడెదూడకు తగలడంతో కోడెదూడ మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని సంతలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కోదాడ సంత ఒకప్పుడు నిత్యం జనంతో కళకళలాడేది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది ఈ సంతకు వచ్చి క్రయ విక్రయాలు కొనసాగించేవారు. కానీ సంతలో దళారీలదే ఇష్టారాజ్యంగా ఉండటంతో రైతులు సంతకు రావాలంటేనే జంకుతున్నారు. అయినప్పటికీ ఆర్థికంగా డబ్బులు అవసరం ఉన్న రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో సంతకు వస్తుంటారు. ఈ క్రమంలోనే ఆదివారం కూడా హుజూర్‌నగర్‌ పట్టణానికి చెందిన బత్తుల అంజయ్య తన కోడె దూడను సంతలో విక్రయించడానికి తీసుకురాగా కోదాడకు ప్రాంతానికి చెందిన కటిక వ్యాపారి అక్బర్‌ రూ.50 వేలు ఖరీదు చేసే దూడను రూ.10 వేలకు అడుగగా అంత తక్కువ ధరకు అమ్మడం కుదరదని తేల్చి చెప్పాడు. దాంతో ఆగ్రహించిన దళారీ.. రైతుపై దౌర్జన్యంగా కర్రతో దాడికి ప్రయత్నించగా రైతు తప్పించుకునే క్రమంలో ఆ కర్ర దూడ తలపై తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. రైతుకు గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. దాంతో సంతకు వచ్చిన రైతులంతా ఒక్కటవ్వడంతో దళారీ అక్కడి నుంచి పరారయ్యాడు. సంతకు వచ్చిన రైతులు మాకు న్యాయం చేయాలంటూ గేటు ఎదుట బైటాయించి ఆందోళన చేపట్టారు. నడిరోడ్డుపై కర్రలతో దాడులు చేస్తారా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెదూడ విలవిల్లాడుతూ కంటి ముందే మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ధర్నాను విరమింపజేశారు. అనంతరం రైతు అంజయ్య ఫిర్యాదు మేరకు దళారీ అక్బర్‌పై టౌన్‌ ఎస్‌ఐ రామాంజనేయులు కేసు నమోదు చేశారు.