రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

– ముగ్గురికి తీవ్రగాయాలు,నలుగురికి స్వల్ప గాయాలు
నవతెలంగాణ -ఆలేరుటౌన్‌
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందగా ముగ్గురికి తీవ్రగాయాలు, నలుగురికి స్వల్పగాయాలైన సంఘటన సోమవారం ఆలేర్‌ పట్టణంలోని బైపాస్‌ వరంగల్‌, హైదరాబాద్‌ జాతీయ రహదారి దర్గా సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగాం జిల్లా మరిగడికి చెందిన కమలమ్మ కోబాల్‌ కుటుంబం హైదరాబాదులో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. కూతురు వైద్య పరీక్షలు నిమిత్తం ఆటోలో జనగాంకు వస్తున్నారు. పట్టణకేంద్రంలోని ఆటో దర్గా వద్ద చేరిన క్రమంలో అదే రూట్‌లో వెనుకగా వస్తున్న హెస్ట్రో వాహనం ఆటోను ఢ కొట్టింది. అదే వేగంతో కుడి వైపున ఉన్న డివైడర్‌ను దాటి ఎదురుగా వచ్చిన స్కార్పియోని ఢ కొట్టింది. ఈ మొత్తం సంఘటనలను ఆటోలో ఉన్న కమలమ్మ(42) మృతిచెందింది. ఆమె భర్త కోబాల్‌ ,కూతురులకుస్వల్ప గాయాలయ్యాయి. హనుమకొండ ఒకే కుటుంబానికి చెందిన వంశీకష్ణ, నిహారులకు తీవ్ర గాయాలయ్యాయి, జనగామకు చెందిన వర్షిత , హనుమకొండ మమత, హనుమకొండ మహేష్‌ , హనుమకొండ యాదగిరి లకు స్వల్ప గాయాలయ్యాయి. స్కార్పియోలోని ఉన్న మమతకు, హోస్టల్‌ లో ఉన్న డ్రైవర్‌ కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం వీరిలో కొందరిని హైదరాబాద్‌కు, జనగామకు తరలించారు. కమలమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెంకట్‌ శ్రీనివాస్‌ తెలిపారు.