సమస్యలు పరిష్కారానికి సమరశీల పోరాటం..

– అంగన్వాడీ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి
– నిజామాబాద్‌కు చేరుకున్న జీపు జాతా
నవతెలంగాణ-కంఠేశ్వర్‌/ఆర్మూర్‌
ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకపోతే సమరశీల పోరాటమే మార్గమని అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి అన్నారు. యూనియన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్రవ్యాప్త జీపు జాతా సోమవారం నిజామాబాద్‌ నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా ధర్నాచౌక్‌లో జరిగిన సభలో పి.జయలక్ష్మి మాట్లాడుతూ.. ఐసీడీఎస్‌ రక్షణ, అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26 వేల సాధన, 45వ ఇండియన్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ సిఫార్సుల ప్రకారం పెన్షన్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు జరపాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 16 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్త జీపు జాతా చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ఉద్యమానికి సన్నద్ధం చేయనున్నట్టు చెప్పారు.అనేక సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ ఉద్యోగులపై పనిభారం పెంచుతూ నిత్యం నరకయాతన పెడుతున్నారని, వేతనాలు మాత్రం సరిపడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్‌, డీజిల్‌ వంట గ్యాస్‌ ధరలు పెంచారని, మరోవైపు కేంద్ర ప్రభుత్వం 2018లో పెంచిన వేతనాలు అమలు జరపకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని అన్నారు. 2022లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగన్వాడీ ఉద్యోగులకు 1972 చట్టం ప్రకారం వేతనాలు చెల్లించాలని తెలియజేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఉన్న ఖాళీ పోస్టుల భర్తీ చేపట్టలేదని, 2017 నుంచి టీఏ, డీఏలు చెల్లించడం లేదని, ఆన్‌లైన్‌లో అనేక యాప్‌లను పెట్టి పనిభారాన్ని పెంచిందని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సమస్యలను పరిష్కరించకుంటే దేశవ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు పెద్దఎత్తున పోరాటాలకు సిద్ధపడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి సునీత, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎ.రమేష్‌ బాబు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దేవగంగు, పి.స్వర్ణ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్‌, నాయకులు పి.చంద్రకళ, మంగాదేవి, శివరాజమ్మ, పి.వాణి. రాజ సులోచన, సూర్య కళ, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.