– రూ. 934 కోట్లతో తయారీ ప్లాంట్ ఏర్పాటు సుముఖత
– మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైస్లు, గొరిల్లా గ్లాసుల తయారీ
– రాష్ట్రంలో 800 మందికి ఉపాధి
– కార్నింగ్ సంస్థ బృందంతో మంత్రి కేటీఆర్ సమావేశం
– భారీ పెట్ట్టుబడుల పట్ల హర్షం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కార్నింగ్ సంస్థ తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. న్యూయార్క్ కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తున్న కార్నింగ్ సంస్థ మెటీరియల్ సైన్స్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థగా నిలిచింది. ఆ సంస్థ రాష్ట్రాన్ని తన తయారీ కేంద్రంగా ఎంచుకున్నది. రూ. 934 కోట్లతో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంస్థ ముందుకు వచ్చింది. తద్వారా హైదరాబాద్ కేంద్రంగా మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అవసరమైన గొరిల్లా గ్లాస్ను తయారు చేయనుంది. ఇలాంటి గొరిల్లా గ్లాస్ తయారీ ప్లాంట్కు దేశంలోనే తెలంగాణ తొలి కేంద్రం కానున్నది. ఈ భారీ పెట్టుబడి ద్వారా ఎనిమిది వందల మందికిపైగా ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్తో సంస్థ సీనియర్ ఉపాధ్యక్షులు జాన్ బెయిని ప్రతినిధి బందం శుక్రవారం సమావేశమైంది. సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి, ఐటీ శాఖ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజరు కారంపురి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ సంబంధిత రంగాలకు రాష్ట్రం తయారీ కేంద్రంగా మారుతున్న తీరును వివరించారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగ ఈకో సిస్టం రాష్ట్రంలో బలోపేతమైన తీరును, అందుకోసం గత తొమ్మిదేండ్లు కొనసాగుతున్న కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా అనేక ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయనీ, మరికొన్ని సంస్థలు తమ కార్యకలాపాలను విస్తృతపరుస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూలతలు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అనుబంధ రంగాల్లో తయారీ రంగ పెట్టుబడుల కోసం ప్రభుత్వం చూపిస్తున్న చొరవను, ప్రోత్సాహాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని తమకు తయారీ ప్లాంట్ కేంద్రంగా ఎంచుకున్నట్టు కార్నింగ్ సంస్థ ప్రతినిధులు మంత్రికి తెలిపారు. తమ తయారీ కేంద్రాన్ని హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చే విషయంలో మంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఐటీ, పరిశ్రమల శాఖ నిరంతరం తమతో సంప్రదింపులు జరిపిన విషయాన్ని, ప్రభుత్వ చిత్తశుద్ధిని సంస్థ ప్రత్యేకంగా ప్రశంసించింది.
రాష్ట్రానికి గత తొమ్మిదేండ్లుగా అనేక అంతర్జాతీయ సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చాయనీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఫాక్స్కాన్ వంటి దిగ్గజ సంస్థలతోపాటు అనేక అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులతో ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ కేంద్రంగా తన తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్న కార్నింగ్ సంస్థకు మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. సంస్థ కార్యకలాపాల ప్రారంభానికి అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.