
కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్యా బోధన జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో ఈ సంవత్సరం ఇంటర్ మొదటి సంవత్సరంలో మంచి మార్కులు సాధించిన ఏడుగురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అలాగే రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన 5 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించారు. పై చదువుల పట్ల వారి ఆసక్తిని అడిగి తెలుసుకున్నారు. విద్య మాత్రమే మనిషిని ఉన్నత శిఖరాలకు చేర్చగలదని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో ఉన్నత చదువులు అభ్యసించాలని. విద్యను మించిన అస్థి మరొకటి లేదని చెప్పారు. ఉన్నత చదువులతో ఐఏఎస్, ఐపీఎస్, వైద్య, ఇంజినీరింగ్, ఉపాధ్యాయ వంటి పదవులు సాధించి మీ తల్లి తండ్రులకు తద్వారా మీ గ్రామానికి మన జిల్లాకు, రాష్ట్రానికి మన దేశానికి సేవలు అందించు స్థాయికి రావాలని చెప్పారు.ఎన్ని అడ్డంకులు వచ్చిన కృంగి పోకుండా అనుకున్న లక్ష్యం సాధించేవరకు నిరంతర కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ప్రోత్సాహించిన తల్లిదండ్రులను, గురువులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి సులోచన రాణి తదితరులు పాల్గొన్నారు.