ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్కేఎన్ నిర్మించారు. ఈ సినిమా నుంచి ‘ఓ రెండు మేఘాలిలా’, ‘దేవరాజ..’ పాటలు విడుదలై ప్రేక్షకులను విశేషంగా అలరించి, యూట్యూబ్లో మంచి వ్యూస్ తెచ్చుకున్నాయి. లేటెస్ట్గా నాయిక రష్మిక మందాన రిలీజ్ చేసిన బ్రేకప్ సాంగ్ ‘ప్రేమిస్తున్నా’ యూత్కి బాగా కనెక్టై సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా నుంచి నాలుగవ పాట కూడా ఈ వారంలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలా టీజర్, పాటలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం ప్రేక్షకులలో మంచి హైప్ తెచ్చుకోవడమే కాకుండా విడుదల తేదీ గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులను ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది. ఈ చిత్రాన్ని జూలై రెండో వారంలో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మేకర్స్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజరు బుల్గానిన్, సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి, ఎడిటింగ్: విప్లవ్, కళ: సురేష్.