గోద్రా రైలు దహనం కేసులో దోషులకు బెయిల్‌ నో

– నిరాకరించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : గోద్రా రైలు దహనం కేసు దోషులకు బెయిలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మత కల్లోలాలకు కారణమైన 2002లో జరిగిన రైలు దహనం కేసును న్యాయస్థానం ‘తీవ్రమైన ఘటన’గా పేర్కొంది. ఈ ఘటనలో దోషులు ముగ్గురు క్రియాశీల పాత్ర పోషించినట్టు తెలిపింది. దోషులు సౌకత్‌ యూసుఫ్‌ ఇస్మాయిల్‌, బిలాల్‌ అబ్దుల్లా ఇస్మాయిల్‌, సిద్దిక్‌లు ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. రైలు దహనం ఘటన చాలా తీవ్రమైనదని, ఇది ఒంటరి వ్యక్తి హత్యకు సంబంధించినది కాదని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ జేబీ పార్థీవాలా, మనోజ్‌ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. రైలు దహనం కేసులో ఈ దోషులు ముగ్గురు నిర్దిష్ట పాత్రలు పోషించినట్టు తెలిపింది. అప్పిలెంట్ల నిర్దిష్ట పాత్ర నేపథ్యంలో వారికి బెయిలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు చెబుతూ వారు పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.