– నష్టం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి
– కలెక్టర్లకు సీఎస్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయనీ, వచ్చే మూడు రోజులపాటు అవి కొనసాగనున్న క్రమంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా అన్ని శాఖలూ సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ పరిస్థితులను సమీక్షించారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లోని చెరువులు, కుంటలు నిండి ఉన్నాయనీ, ఆయా చెరువులకు గండ్లు పడడం, తెగిపోకుండా ఉండేందుకు తగు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉధృతంగా ప్రవహించే కాజ్-వేలు, కల్వర్టులు, వంతెనల వద్ద ముందు జాగ్రత్త చర్యగా తగు భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని అన్నారు. భారీ వర్షాలు, వరదలతో జరిగే నష్టాన్ని నివారించేందుకు సంబంధిత మండల స్థాయి రెవెన్యూ, పీఆర్ తదితర అధికారులతో రెగ్యులర్ టెలీ-కాన్ఫరెన్స్ల ద్వారా సమీక్షించాలని కోరారు. ప్రతి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షించాలని సూచించారు. వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల కోసం స్థానిక అగ్నిమాపక, పోలీసు బృందాలను మోహరించాలని తెలిపారు. వర్షం, వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి బాధిత కుటుంబాలకు సహాయక శిబిరాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వారికి ఆహారం, మంచినీరు, వైద్య తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆమె ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాల్లో తగు ముందస్తు ఏర్పాట్లను చేయడంతోపాటు, మ్యాన్-హోళ్లపై కప్పులు తెరవకుండా నగర వాసులను చైతన్య పర్చాలని తెలిపారు. సమీక్షలో డీజీపీ అంజనీ కుమార్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రజత్ కుమార్, అర్వింద్ కుమార్, సునీల్ శర్మ, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఫైర్ సర్వీసుల శాఖ డీజీ నాగిరెడ్డి, జలమండలి ఎండీ దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ తదితరులు పాల్గొన్నారు.